న్యూదిల్లీ : వచ్చే సార్వత్రిక ఎన్నికలలో 255 స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే ఇండియా ఐక్య సంఘటన భాగస్వామ్య పక్షాలు అధికారంలో ఉన్న దిల్లీ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్లో సీట్లు పంచుకోవడం కష్టం అన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. కాంగ్రెస్ కూడా ఈ వాస్తవం అంగీకరిస్తోంది. 2019 లోకసభ ఎన్నికలలో కాంగ్రెస్ 421 స్థానాలలో పోటీ చేసింది. కానీ సాధించింది 52 మాత్రమే. ఇటీవల రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ అధికారం నిలబెట్టుకోలేకపోయింది. మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలోనూ పరాజయమే ఎదురైంది. ఈ మూడు రాష్ట్రాలలోనూ కాంగ్రెస్కు ఇదివరకు వచ్చిన ఓట్ల శాతంలో మార్పు లేదు. పైగా ఇటీవలి మూడు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో గెలిచిన బీజేపీకన్నా కాంగ్రెస్కు పది లక్షల ఓట్లు ఎక్కువే వచ్చాయి. ఇండియా ఐక్య సంఘటన భాగస్వామ్య పక్షాలతో త్వరలో సీట్ల పంపిణీ గురించి చర్చలు మొదలవుతాయని కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అయిదుగురు సభ్యులు గల జాతీయ ఐక్య సంఘటన కమిటీతో సమావేశమయ్యారు. ఈ కమిటీ ఇటీవలే కాంగ్రెస్ నాయకత్వానికి నివేదిక అందజేసింది. ఎఐసీసీ ప్రధాన కార్యదర్శులు, వివిధ రాష్ట్రాలలో కాంగ్రెస్ పరిశీలకులు, కాంగ్రెస్ శాసనసభా పక్షాల నాయకులతో సమావేశమైనప్పుడు 255 సీట్లలో కాంగ్రెస్ పోటీ చేసే అవకాశం ఉందని ఖడ్గే సూచన ప్రాయంగా తెలియజేశారు. మోదీ నాయకత్వంలోని బీజేపీని గద్దె దించడానికి తక్కువ సీట్లలో పోటీతో సరిపెట్టుకోవడానికి రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులు సుముఖంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. పంజాబ్లో కాంగ్రెస్తో కలిసి పోటీ చేయడానికి అక్కడ అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అనుకూలంగానే ఉంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు ఆత్మహత్యా సదృశం అవుతుందని పంజాబ్ కాంగ్రెస్ నాయకులు వాదిస్తున్నారు. బెంగాల్ కాంగ్రెస్ విభాగం కూడా తృణమూల్తో సీట్ల సర్దుబాటుకు సుముఖంగా లేదు. కాంగ్రెస్కు రెండు సీట్లు మాత్రమే కేటాయించాలన్న తృణమూల్ ప్రతిపాదనపై లోకసభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు అధీర్ రంజన్ మండిపడ్తున్నారు. తృణమూల్ దయాదాక్షిణ్యాలు తమకు అవసరం లేదంటున్నారు. కాంగ్రెస్ సహకరిస్తే సీట్ల సర్దుబాటుకు సిద్ధమేనని తృణమూల్ నాయకులు భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో సమాజ్ వాదీ పార్టీ 65 స్థానాల్లో పోటీ చేయాలనుకుంటోంది. అంటే కాంగ్రెస్, ఆర్ఎల్డీకి కలిపి 15 సీట్లు మాత్రమే కేటాయించడానికి సిద్ధంగా ఉంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో సీట్ల సర్దుబాటు కోసం ఇండియా ఐక్య సంఘటన భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరపాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇండియా కూటమి మెజారిటీ సీట్లు గెలుచుకునే రీతిలోనే సర్దుబాట్లు జరగాలని కాంగ్రెస్ నాయకుడు ముకుల్ వాస్నిక్ అంటున్నారు. కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం నాయకత్వంలోని కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక రూపొందించడానికి ఏర్పడిన కమిటీ సమావేశం కూడా జరిగింది. విభేదాలు పక్కన పెట్టాలని, బహిరంగంగా ఎవరి మీదా ప్రతికూల వ్యాఖ్యలు చేయకూడదని ఖడ్గే కాంగ్రెస్ నాయకులకు సూచించారు.