. అదనంగా కలిసిన 74 బ్రాంచీలు
. అందుబాటులో కంప్యూటర్, అనుబంధ సీట్లు
. విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఊరట
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: ఏపీ ఈఏపీసెట్
2024 ఇంజినీరింగ్ కౌన్సెలింగ్లో భాగంగా బుధవారం కన్వీనర్ కోటాలో ప్రైవేట్ ఇంజినీరింగ్ యూనివర్సిటీలు భాగస్వాములయ్యాయి. వాటి ద్వారా మొత్తం 7950 సీట్లు భర్తీ చేయనున్నారు. ఇందులో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, వాటి అనుబంధ కంప్యూటర్ కోర్సులతోపాటు కీలక సబ్జెక్టులైన ఈసీఈ, ఈఈఈ, మెకానికల్ బ్రాంచీలున్నాయి. ఈనెల 8వ తేదీ నుంచి వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభమైనప్పటికీ…9వ తేదీ వరకు వాటి జాబితాను అందుబాటులో ఉంచలేదు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి పెద్దఎత్తున ఏపీఈఏపీసెట్ కన్వీనర్కు ఫోన్లు చేయడంతో ఎట్టకేలకు వాటి జాబితాను కన్వీనర్ కోటాలో జత చేశారు. ఇందులో పేరొందిన ప్రైవేట్ యూనివర్సిటీలతోపాటు ఈ ఏడాది నుంచి కొత్తగా మరో మూడు ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చి చేరాయి. అమరావతిలోని వీఐటీ ఏపీ15 బ్రాంచీలు, ఎస్ఆర్ఎం ఏపీ
5 బ్రాంచీలు, చిత్తూరు జిల్లాలోని అపోలో యూనివర్సిటీ4, విజయనగరం జిల్లాలోని టెక్కలిలో ఉన్న సెంచూరియన్ యూనివర్సిటీ
13, రాజంపేటలోని మోహన్బాబు యూనివర్సిటీ10, అనంతపురంలోని భారతీయ ఇంజినీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ
4 బ్రాంచీల చొప్పున సీట్లు వెబ్ కౌన్సెలింగ్లోకి అందుబాటులోకి వచ్చాయి. వాటితోపాటు వైసీపీ ప్రభుత్వ హయాంలో కొత్తగా మంజూరైన తూర్పుగోదావరి జిల్లా సూరాయపాలెంలోని ఆదిత్య యూనివర్సిటీలో`11 బ్రాంచీలు, రాజమండ్రిలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ11 బ్రాంచీలు, రాజంపేటలోని అన్నమాచార్య యూనివర్సిటీ
11 బ్రాంచీలతో కన్వీనర్ కోటా సీట్లు భర్తీ కానున్నాయి. ఏపీఈఏపీసెట్లో అర్హత సాధించిన అభ్యర్థులంతా ఈ బ్రాంచీలతో ఉన్న సీట్లను ఆప్షన్లుగా ఎంపిక చేసుకోవచ్చు. ప్రైవేట్ యూనివర్సిటీల్లోనూ ఈ విద్యా సంవత్సరం అత్యధికంగా కంప్యూటర్ సైన్స్ అనుబంధ కోర్సుల సీట్లకే పెద్దపీట వేశారు. ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి కంప్యూటర్, అనుబంధ బ్రాంచీలకు కన్వీనర్ కోటా ఫీజులు పెరిగాయి. కన్వీనర్ కోటాలో సీట్లు పొంది, ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హత ఉన్న వారు ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. వారికి ఉచితంగా సీట్లు లభిస్తాయి. ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హతలేని వారంతా, తప్పనిసరిగా ఆయా యూనివర్సిటీల్లో నిర్దేశించిన కన్వీనర్ కోటా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దాంతోపాటు హాస్టల్ సౌకర్యం కోరుకుంటే…అందరికీ నిర్దేశించిన ఫీజులు వర్తిస్తాయి. ఈనెల 12వ తేదీతో వెబ్ ఆప్షన్లు ముగియనున్నాయి. తొలి రోజు వచ్చిన సాంకేతిక కారాణాల రీత్యా మరో ఒకటి, రెండు రోజులపాటు సమయం పొడిగించాలని అభ్యర్థులు కోరుతున్నారు.