. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
. ప్రభుత్వానికి వారం రోజులే గడువు: ముప్పాళ్ల
. న్యాయపోరాట దీక్షకు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల సంఫీుభావం
. భవిష్యత్ పోరాట కార్యాచరణపై తీర్మానాలు
విశాలాంధ్ర`విజయవాడ: గత ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షనేత హోదాలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్వర్యంలో అగ్రిగోల్డ్ బాధితుల ‘న్యాయ పోరాట దీక్ష’ విజయవాడ ధర్నా చౌక్ వద్ద గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ కస్టమర్లు, ఏజెంట్లు పైసా పైసా కూడబెట్టి అగ్రిగోల్డ్ కంపెనీ యాజమాన్యం వద్ద పెట్టటం జరిగిందన్నారు. కంపెనీ మోసానికి బలైన బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చి సీఎం జగన్ మోసం చేశాడని విమర్శించారు. ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా కంపెనీ వద్ద ఉన్న వేల కోట్ల రూపాయలు ఆస్తుల్ని అమ్మి బాధితులకు చెల్లిస్తే మంచి పేరు వచ్చేదన్నారు. వచ్చే ఎన్నికల్లో అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను పరిష్కరిస్తామని రాజకీయ పార్టీలు వారి మేనిఫెస్టోల్లో పెట్టేలా పోరాటం చేయాలన్నారు. బాధితుల తరుపున పోరాడే పార్టీలను ఆదరించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఇంటికి పోవడం ఖాయమని సర్వేలు వస్తున్నాయని చెప్పారు. మూడు నెలల తరువాత తాడేపల్లి ప్యాలెస్, ఇడుపులపాయలను వదిలేసి పక్క రాష్ట్రాల నగరాలైన హైదరాబాద్, బెంగళూరులో ఉండే పరిస్థితి వస్తుందన్నారు. ఎమ్మెల్యేలను, ఎంపీలను బదిలీలు చేస్తున్నారని ఒక నియోజకవర్గంలో పనికిరాని వారు మరో నియోజవర్గంలో ఎలా పనికి వస్తారు? అని ప్రశ్నించారు. ఎవరు అధికారంలో ఉన్నా సమస్యలపై పోరాటం చేసి సాధించుకోవటానికి ఎర్ర జెండా పార్టీల అవసరం ఉందన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితుల న్యాయమైన పోరాటానికి సీపీఎం పక్షాన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పేదల సంక్షేమ పథకాల కోసం రూ. రెండున్నర లక్షల కోట్లు బటన్ నొక్కి ఇస్తున్నట్లు చెబుతున్న ముఖ్యమంత్రి… కంపెనీకి ఉన్న వేల కోట్ల ఆస్తులను ప్రభుత్వం చేతిలో పెట్టుకుని అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయకపోవటంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్పేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ సీఎం జగన్ చెపుతున్న ‘వై నాట్ 175’ అనేది నిజం కావాలంటే దాదాపు 40లక్షల అగ్రిగోల్డ్ బాధితుల ఓట్లు వచ్చేలా చూసుకోవాలని హితవు పలికారు. 12 లక్షల అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాల కోసం రూ.8080 కోట్లు అడ్వాన్సుగా ఇచ్చి కంపెనీ ఆస్తుల నుంచి జమ చేసుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఆ ఆస్తులను అమ్మి బాధితులకు చెల్లిస్తే ఎవరు వద్దంటారు? ప్రభుత్వం ఇస్తానంటే ఎవరు అడ్డు తగులుతున్నారు? అని ప్రశ్నించారు. కంపెనీ మోసానికి ఆత్మహత్య చేసుకున్న వారు, గుండెపోట్లకు గురైనవారు, అసహజ మరణాలు పొందిన వారికి ఆనాటి ప్రభుత్వం రూ.3లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తే తాను అధికారంలోకి వచ్చిన తరువాత రూ.10లక్షలు పువ్వుల్లో పెట్టి ఇంటికి పంపిస్తానని ఇచ్చిన మాట నేటికీ అమలు కాలేదన్నారు. ఈ నెల 6వ తేదీన దీక్ష చేస్తామని పోలీసులకు నోటీసులు ఇస్తే 14వ తేదీ రాత్రి 9.30గంటలకు అనుమతి ఇచ్చారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 3వేల మందికి నోటీసులు ఇచ్చారని 150 మందికి పైగా గృహనిర్బంధం చేశారని తెలిపారు. జగన్ ఇచ్చిన హామీకి సాక్షీభూతంగా ఉన్న మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్సా సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తమ నాయకుడికి ఎందుకు గుర్తు చేయటం లేదని ప్రశ్నించారు. వారం రోజుల్లో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని ప్రకటించకపోతే వైసీపీ ప్రభుత్వంతో తాడోపెడో తేల్చుకుంటామని హెచ్చరించారు. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు వీవీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితుల అసోసియేషన్ పోరాటంలో భాగంగా చలో హాయ్ల్యాండ్ పిలుపు ఇవ్వటం వల్లే అగ్రిగోల్డ్ కంపెనీ ఆస్తిగా ఉందన్నారు. లేకుంటే ఎప్పుడో అగ్రిగోల్డ్ కంపెనీకి హాయ్ల్యాండ్కు సంబంధం లేదని చెప్పటం జరిగేదన్నారు. బాధితులకు న్యాయం చేయటం కోసం ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించాలని కోరారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పే పార్టీలు హామీ పత్రం రాసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. న్యాయ పోరాట దీక్షలో భాగంగా అన్ని రాజకీయ పార్టీలు అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను వారి వారి మేనిఫెస్టోలో పెట్టాలని, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బాధితుల సమస్యను పరిష్కరించాలని అసోసియేషన్ ప్రవేశపెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించారు. రెండు రోజుల్లో ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాయాలని నిర్ణయించారు. ప్రభుత్వ స్పందనను బట్టి అన్ని స్థాయిల్లో ప్రతిస్పందించాలని తీర్మానించారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఈవీ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ న్యాయ పోరాట దీక్షలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షులు జి.ఈశ్వరయ్య, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు సీహెచ్.కోటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య నాయకులు నాగలక్ష్మి, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర నాయకులు డి.హరినాథ్, నవతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం, నేషలిస్ట్ జనశక్తి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సూరిబాబు అగ్రిగోల్డ్ బాధితులకు మద్దతుగా మాట్లాడారు. సీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్, విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, అమ్ఆద్మీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జీఎస్.ఫణిరాజ్, ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిమ్మన్న, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర కోశాధికారి ఆర్.పిచ్చయ్య దీక్షలో పాల్గొని సంఫీుభావం ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బీవీ.చంద్రశేఖర్ నాయకులు బెల్లంకొండ శ్రీనివాస్, శేషుకుమార్ రెడ్డి, ఆరెళ్లమ్మతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా ముప్పాళ్ల నాగేశ్వరరావు, చలసాని శ్రీనివాసరావులు దీక్షాదారులకు దండలు వేసి న్యాయ పోరాట దీక్షలను ప్రారంభించారు. ప్రభుత్వం తీరును నిరసిస్తూ న్యాయ పోరాట దీక్షను నిరాహార దీక్షగా మార్చారు. జగన్ ప్రభుత్వం ఇచ్చిన మాట నమ్మి జీవచ్ఛవాలుగా ఉన్నామంటూ ఫ్లకార్డు ప్రదర్శన సమస్య తీవ్రతకు అద్దం పట్టింది.