ఈడీ అరెస్టు రద్దుపై అత్యవసర విచారణకు సుప్రీం తిరస్కృతి
మరికొన్ని రోజులు తీహార్ జైల్లోనే దిల్లీ సీఎం
న్యూదిల్లీ: దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కార్యదర్శి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలవడం మరింత ఆలస్యమయ్యే పరిస్థితి నెలకొంది. మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ అధికారులు కేజ్రీవాల్ను అరెస్ట్ చేయగా… వచ్చే వారం వరకు జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో (రిమాండ్ ఖైదీగా) కొనసాగనున్నారు. ఈడీ అక్రమ అరెస్టుపై కోర్టు తలుపు తట్టిన కేజ్రీవాల్కు ఊరట దక్కడం లేదు. తన అరెస్ట్ అక్రమమని, ఈడీ అరెస్ట్ను రద్దు చేయాలని మంగళవారం దిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. అయితే దిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన బుధవారం సుప్రీం కోర్టును ఆశ్రయించగా… అక్కడ కూడా ఎదురు దెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్పై వెంటనే విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తిరస్కరించారు. కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఫ్వీు బుధవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఎదుట వాదనలు వినిపిస్తూ తన క్లయింట్ పిటిషన్పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు. అయితే ఈరోజు విచారణకు అనుమతిస్తారో లేదో చెప్పేందుకు ప్రధాన న్యాయమూర్తి నిరాకరించారు. ‘చూస్తాం, పరిశీలిస్తాం’ అని చెప్పారు. కాగా, కేజ్రీవాల్ అప్పీల్పై అత్యవసర విచారణ కోసం సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేయదని తెలుస్తోంది. సుప్రీంకోర్టు క్యాలెండర్ ప్రకారం… గురువారం ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా కోర్టు కార్యకలాపాలు జరగవు. శుక్రవారం స్థానిక సెలవుదినం, ఆపై శని, ఆదివారాలు సెలవులు కనుక వారం ముగుస్తుంది. సోమవారం తిరిగి సుప్రీం కోర్టు కార్యకలాపాలు పున:ప్రారంభం అవుతాయి. అప్పటి వరకు తీహార్ జైల్లో కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ కొనసాగనుంది.
మీరు ముఖ్యమంత్రి అయితే ఏంటి?
దిల్లీ హైకోర్టు మంగళవారం కేజ్రీవాల్ అరెస్ట్కు ఈడీ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. కేజ్రీవాల్ అరెస్ట్, రిమాండ్ చట్టవిరుద్ధం కాదని వ్యాఖ్యానించింది. సీఎంకు ఒక న్యాయం, సామాన్యులకు మరొక న్యాయం ఉండదని, సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హుక్కులేమీ ఉండని స్పష్టం చేసింది. విచారణ ఎలా సాగాలో నిందితుడు చెప్పనవసరం లేదంటూ వ్యాఖ్యానించింది.
జైలు మ్యాన్యువల్ అడిగిన కేజ్రీవాల్
కేజ్రీవాల్ అభ్యర్థన మేరకు జైలు అధికారులు ఆయనకు జైలు మాన్యువల్ కాపీని అందించారు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ… జైలు లైబ్రరీలో అందుబాటులో ఉన్న ఏదైనా పుస్తకాన్ని ఖైదీ చదవవచ్చని తీహార్ జైలు అధికారి తెలిపారు. తీహార్ జైలుకు పంపిన తర్వాత కేజ్రీవాల్ జైలు అధికారులను రామాయణం, మహాభారత గ్రంథాలతో పాటు ‘ప్రధానులు ఎలా నిర్ణయించబడతారు’ అనే పుస్తకాన్ని అడిగారు. ఇక తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్, ఇతర ఆప్ నేతలకు కూడా వారిని ఉంచిన సెల్లలో దోమతెరలు అందించారు. నిబంధనల ప్రకారం ఖైదీలకు వారి సెల్లలో దోమతెరలు అందించవచ్చని ఓ అధికారి తెలిపారు. కేజ్రీవాల్ తన సెల్లో కుర్చీపై కూర్చొని పుస్తకాలు చదువడం, రాయడం చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఇక ఆయన తన సెల్లో జైలు మాన్యువల్ను కూడా చదువుతున్నట్లు జైలు వర్గాలు వెల్లడిరచాయి. తన సెల్లో 20 ఛానల్స్తో కూడిన టీవీని అందించినప్పటికీ కేజ్రీవాల్ పెద్ద చూసింది లేదు. ఆయన అధిక సమయాన్ని ఎక్కువగా చదవడం, ధ్యానం, యోగా చేయడంలో గడుపుతారని తెలిపాయి. కేజ్రీవాల్ సెల్లో రెండు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా జైలు అధికారులు ఆయనపై రాత్రింబవళ్లు నిఘా పెట్టారు.