దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీ తోపాటు ఉత్తరాదిలో నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్ , త్రిపుర , పశ్చిమబెంగాల్ , సిక్కిం, గుజరాత్ , అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో ఈ నెల 4వ తేదీ వరకు రెడ్ అలర్ట్ అమలులో ఉంటుందని తెలిపింది. ఈ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది. అటు కచ్, ఉత్తర గుజరాత్పై ఉపరితల ఆవర్తన ప్రభావంతో గుజరాత్లోని పలు ప్రాంతాలు భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్నాయి. అహ్మదాబాద్. గాంధీనగర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సూరత్, భుజ్, వాపి, బరూచ్లో రోడ్లు మునిగిపోయాయి. వచ్చే రెండు రోజుల పాటు దక్షిణ సెంట్రల్ సౌరాష్ట్రాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణా, ఉత్తర్ప్రదేశ్, రాజస్థాన్, బిహార్, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా తదితర రాష్ట్రాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. జులై 5 వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని పేర్కొంది. రాబోయే నాలుగైదు రోజుల్లో భారత్లోని వాయవ్య, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో రుతుపవనాలు మరింత చురుగ్గా కదిలే అవకాశం ఉందని తెలిపింది.