ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం ఒడిశా, దక్షిణ జార్ఖండ్, ఉత్తర చత్తీస్ గఢ్లో కొనసాగుతోంది.. అలాగే దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఈ అల్పపీడనం రానున్న రెండు రోజుల్లో ఉత్తర మధ్య ప్రదేశ్ వైపు వెళ్లే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో పడమటి గాలులు వీస్తున్నాయి. మరోవైపు నైరుతి రుతుపవనాలు కూడా రాష్ట్రమంతా విస్తరించాయి. అల్పపీడనం, ఆవర్తనంతో పాటూ రుతుపవనాల ప్రభావంతో వానలు కురుస్తున్నాయి. నేడు (మంగళవారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఉభయగోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, కడప, శ్రీ సత్యసాయి, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.