. తెగిన చెరువులు, పొంగిన వాగులు
. నీట మునిగిన పంటచేలు, కాలనీలు
. నేలకొరిగిన భారీ వృక్షాలు
. అనేకచోట్ల రహదారులు ధ్వంసం
భారీ వర్షాలకు అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లాలు అతలాకుతలమయ్యాయి. సోమవారం రాత్రి ఈదురు గాలులతో కురిసిన కుండపోత వర్షానికి అనేకచోట్ల చెట్లు నేలకొరిగాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కాలనీలు జలమయమయ్యాయి.
విశాలాంధ్రబ్యూరో-అనంతపురం: భారీ వర్షాలకు అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లాలు అతలాకుతలమయ్యాయి. సోమవారం రాత్రి ఈదురు గాలులతో కురిసిన కుండపోత వర్షానికి అనేకచోట్ల చెట్లు నేలకొరిగాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కాలనీలు జలమయమయ్యాయి. పంట చేలు నీటితో నిండిపోయాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. అనంతపురంలో భారీ వృక్షాలు నేల కొరగగా… శ్రీ సత్య సాయి జిల్లా కనగానపల్లి , బండమీద పల్లిలో చెరువు కట్టలు తెగిపోయి పంట చేలను, నివాస ప్రాంతాలను వరద ముంచెత్తింది. రాప్తాడు సమీపంలోని పండమేరు వాగుకు వరద పోటెత్తడంతో సమీపంలోని కాలనీలన్నీ నీటమునిగాయి. రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమై ప్రాణనష్టం జరగకుండా నివారించారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు నియోజకవర్గాల్లో రహదారులు ధ్వంసమయ్యాయి. సుమారు 20 గంటలకు పైగా అనేక చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిరది. వాణిజ్య పంటలైన ద్రాక్ష, కర్బూజా, బొప్పాయి, అరటి, టమోటా పంటలు నీట మునిగాయి. లక్షలాది రూపాయలు నష్టపోయామని బాధిత రైతులు వాపోతున్నారు. బుక్కరాయసముద్రం చెరువుకి వరద నీరు పోటెత్తడంతో నిండుకుండను తలపిస్తోంది. ఉప్పరపల్లి పక్కన లోతట్టు కాలనీలన్నీ నీట మునిగాయి. ప్రసన్నాయన పల్లి ఉప్పరపల్లి మధ్య పండమేరు వాగుకు వరద నీరు పోటెత్తడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెనుగొండ సమీపంలో జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరింది. దీంతో సుమారు మూడు గంటలకు పైగా బెంగళూరు హైదరాబాద్ హైవే పై రాకపోకలకు అంతరాయం కలిగింది. ధర్మవరం చెరువు పొంగి పొర్లుతోంది. అనంతపురంలోని ఆటోనగర్ ప్రాంతాల్లో ఇళ్లన్నీ నీట మునిగాయి. తెల్లవారుజామున నాలుగు గంటలకే ఇళ్లల్లోకి నీరు రావడంతో కట్టుబట్టలతో జనం రోడ్లపైకి పరుగులు తీశారు. అనంతపురం పట్టణంలో రైల్వే స్టేషన్ రోడ్డులో వినాయక గుడి ఎదురుగా పెద్ద వృక్షం నేలకొరిగింది. డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి చొరవ తీసుకొని మున్సిపల్ సిబ్బందితో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూశారు. మరో రెండు రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ వినోద్ కుమార్ రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశాలిచ్చారు. భారీ వర్షానికి నగరానికి ఆనుకుని ఉన్న పండమేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కనగానపల్లి చెరువు కట్ట తెగిపోవడంతో అనంతపురం గ్రామీణ మండలంలోని రామకృష్ణ కాలనీ, కళాకారుల కాలనీ, ఇందిరమ్మ కాలనీ, జగనన్న కాలనీల్లోకి ఐదు అడుగులమేర వరద నీరు చేరింది. ఇళ్లు, వాహనాలు నీటమునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముష్టూరు వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై వరద కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. అర్ధరాత్రి ప్రవాహాన్ని గుర్తించకపోవడంతో మూడు బస్సులు వరదలో చిక్కుకున్నాయి. రహదారి పక్కన ఉన్న పెట్రోల్ బంకును వరదనీరు ముంచెత్తింది. పెనుకొండ మండలంలోని మునుమడుగు వద్ద ఉన్న కియా అనుబంధ పరిశ్రమలకు వెళ్లే రహదారి కోతకు గురైంది. సుమారు 2వేల మంది కార్మికులు పరిశ్రమలోకి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరద నీటిలోనే ప్రమాదకరంగా నడుచుకుంటూ కార్మికులు అవతలి వైపు వెళ్లారు. ఆకస్మికంగా వరదలు రావడంతో ప్రభుత్వం సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి ఆహార సదుపాయాలు కల్పిస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ పర్యటించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ముందే అప్రమత్తం చేయడంతో నష్టతీవ్రత తగ్గిందని తెలిపారు.