హోదాతోనే రాష్ట్రాభివృద్ధి: రామకృష్ణ
విశాలాంధ్ర బ్యూరో`మచిలీపట్నం: రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తి అయినా ఆస్తుల పంపిణీలో అంధ్రప్రదేశ్కు న్యాయం జరగలేదని, వేల కోట్ల రూపాయల ఆస్తులు ఏపీకి రావలసి ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని భాస్కరపురంలో ఆదర్శ కమ్యూనిస్టు, అమరజీవి మోదుమూడి శ్రీహరిరావు 25వ వర్ధంతి సభలో పాల్గొనేందుకు వచ్చిన రామకృష్ణ సోమవారం విలేకరులతో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపిణీ, ఇతర సమస్యలు, పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో గ్రామాల విలీనం, తదితర సమస్యల పరిష్కారానికి సహృద్భావ వాతావరణంలో చర్చలు జరగాలని రామకృష్ణ సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. విభజన తర్వాత ఆదాయవనరులు ఎక్కువగా ఉన్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళుతోందని, వనరులు లేని ఏపీ వెనుకపడిరదన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాలు అభివృద్ధికిగాను ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదానే మార్గమని ఆయన స్పష్టంచేశారు. విభజన హామీల సాధనకు ఎవరితోనైనా కలిసి పని చేస్తామన్నారు. ఆస్తుల పంపకంలో అవకతవకలు జరిగాయన్నారు. రెండు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలని చెప్పారు. ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేకంగా బుందేల్ఖండ్ తరహాలో ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలుగు ప్రజలందరూ రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారన్నారు. సహృద్భావ వాతావరణంలో చర్చలు జరుపుకొని సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. ఎన్నికల హామీలో ఇచ్చిన విధంగా అందరికీ ఉచిత ఇసుక అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. గత ఐదేళ్లలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ సీజన్ మొదలైనందున ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు 20 వేల రూపాయలు ప్రభుత్వం అందజేయాలని డిమాండ్ చేశారు. కమ్యూనిస్టు పార్టీ తరపున ప్రత్యేకహోదా కోసం పాటుపడే ఏ ప్రభుత్వానికైనా తమ సహకారం ఉంటుందన్నారు.