. మోదీ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం
. ‘ఏపీలో కాంగ్రెస్కు పునరుజ్జీవం తెస్తాం
. కాంగ్రెస్ నేత సచిన్ పైలట్
విశాలాంధ్ర-తిరుపతి : ‘ఇండియా’ కూటమితోనే ఆంధ్ర ప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధ్యమని ఏఐసీసీ నేత, రాజస్తాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ అన్నారు. తిరుపతి నగరం తారకరామా స్టేడియంలో శుక్రవారం ‘ఇండియా కూటమి’ అధ్వర్యంలో న్యాయసాధన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరయిన సచిన్ పైలట్ మాట్లాడుతూ తన తండ్రి రాజేష్ పైలట్కు ఏపీతో ఎంతో మంచి సంబంధం ఉండేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో తీర్మానం చేశారని… ఆ మంత్రివర్గంలో తానూ ఉన్నట్లు సచిన్ పైలట్ గుర్తు చేశారు. అయితే నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక పదేళ్లుగా ఏపీకి ప్రత్యేక హోదా విషయం విస్మరించారన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి మంత్రివర్గ సమావేశంలోనే ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ఆ విషయం చెప్పడానికే తాను తిరుపతిలో నిర్వహించిన న్యాయసాధన సభకు విచ్చేసినట్లు ఆయన చెప్పారు. ప్లానింగ్ కమిషనులో ప్రత్యేక హోదా గురించి పాస్ చేశామన్నారు. అయినా ప్రత్యేక హోదా ఇవ్వక పోవడం శోచనీయమని సచిన్ పైలట్ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశమే బీజేపీకి లేదన్నారు. మోదీ చొరవ చూపక పోవడమే ఇందుకు కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. మోదీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముఖ్యంగా రైతులు, వెనుకబడిన తరగతులు, అణగారిన వర్గాలను మోదీ మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. హిందు, ముస్లింల మధ్య కూడా విద్వేషం రగుల్చుతున్నారన్నారు. ప్రాంతీయ పార్టీలతో ప్రత్యేక హోదా సాధ్యం కాదన్నారు. ప్రత్యేక హోదా కావాలంటే కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకు రావాలన్నారు. వైఎస్ షర్మిలారెడ్డి అధ్వర్యంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం వస్తుందని సచిన్ పైలట్ దీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులు ఇవ్వడం లేదన్నారు. కేంద్రం నిధుల కోసం కేరళ, కర్నాటక ప్రభుత్వాలు దిల్లీలో పోరాటం చేశాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్, సైకిల్ను ఊరి బయటకు పంపాలని పిలుపునిచ్చారు. తిరుపతిలో వెంకన్న సాక్షిగా మోదీ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని విస్మరించారన్నారు. అందుకే మోదీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. పదేళ్ల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్కు ఉత్సాహం పెరిగిందన్నారు. ‘ఇండియా కూటమి’ తో మోదీ, జగన్, చంద్రబాబును తరిమికొడతామన్నారు. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా వచ్చే అవకాశమే లేదన్నారు. హోదా విషయం తెలియదని అబద్ధాలు చెప్పే ప్రధాని నరేంద్ర మోదీ అదే పార్టీ నేత అయిన వెంకయ్య నాయుడును అడిగి హామీ గుర్తు
చేసుకోవాలన్నారు. అవసరానికి వేషాలు వేసే మోదీ… ఆ మోదీ కాళ్లు పట్టుకుని వేలాడే జగన్, చంద్రబాబు నాయుడు పిరికి రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి పిరికివాళ్ల వల్ల ప్రజలకు మేలు కన్నా కీడే ఎక్కువ జరుగుతుందన్నారు. మట్టి, నీళ్లు మనకు పోసి, దత్త పుత్రులు 29 మందికి వేల కోట్ల రాయితీలు, రుణ మాఫీ చేసి లబ్ధి చేకూర్చే పనులను చేశారన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కడుపులో పుట్టి పిరికిలా బతుకుతున్న జగన్ రాజకీయాలు ఎందుకు చేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. తెలుగువారి ఆత్మ గౌరవం కాపాడిన ఎన్టీఆర్కు, ప్రాజెక్టులు తెచ్చి ధీరో దత్త పాలన చేసిన వైఎస్కు ద్రోహం చేసిన చంద్రబాబు, జగన్ను నమ్మొద్దని ప్రజలకు నారాయణ విజ్ఞప్తి చేశారు. రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమిని ప్రజలు ఆదరించాలని నారాయణ కోరారు.
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ ‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’ అని ఇదే మైదానంలో 2014లో జరిగిన సభలో మోదీ తిరుమల వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చారన్నారు. అయితే అధికారంలోకి వచ్చాక మూడు నామాల స్వామి అయిన తిరుమల వెంకన్నకే పంగనామాలు పెట్టారని ఆమె విమర్శించారు. రామ భక్తుడిని అని చెప్పుకునే మోదీ ఇలా మాట తప్పడం న్యాయమా అని అమె ప్రశ్నించారు. మోదీ ఓట్ల కోసం… రాజకీయం కోసం ప్రత్యేక హోదా అంటూ నాటకం ఆడారన్నారు. పదేళ్లుగా ప్రధాన మంత్రిగా ఉన్న మోదీ ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వలేదన్నారు. దిల్లీని మించిన రాజధాని… ప్రత్యేక రైల్వే జోన్లు…కడపలో స్టీల్ ప్లాంటు… దుగ్గిరాజుపట్నం ఓడరేవు… విశాఖ-చెన్నై కారిడార్… రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని చెప్పిన మోదీ… అధికారంలోకి వచ్చాక మాట తప్పారన్నారు. పదేళ్లుగా ఈ హామీలు అమలు చేయలేదన్నారు. ఇక చంద్రబాబు సింగపూర్ లాంటి రాజధాని కడతామని మాట తప్పారన్నారు. జగనన్న అయితే మూడు రాజధానులు అంటూ కనీసం ఒక్క రాజధాని కట్టలేదన్నారు. జగనన్న కారణంగా ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మారిపోయిందన్నారు. పాలకుల తీరుతో దక్షిణ భారతదేశంలోనే మెట్రో సిటీ లేని రాష్ట్రంగా ఏపీ ఉండటం బాధాకరమన్నారు. ఏపీలో పాలకపక్షం, ప్రతిపక్షం ఇద్దరూ కలసి మోదీ మీద త్రిముఖ ప్రేమలో పడ్డారని వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. అందుకే మోదీని ఎదిరించకుండా ఆయన కాళ్ల వద్ద సాగిలా పడుతున్నారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. పరిశ్రమలతో నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందన్నారు. ప్రత్యేక హోదాతో ఉత్తరాఖండ్లో 2 వేలు, హిమాచల్ ప్రదేశ్లో 10 వేల పరిశ్రమలు వచ్చాయని షర్మిల ఈ సందర్భంగా గుర్తు చేశారు. జగన్ మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారన్నారు. ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండరు విడుదల చేస్తామని మాట తప్పారన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్కు బుద్ధి చెప్పాలని షర్మిల పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేవీపీ రామచంద్రరావు, జేడీ శీలం, రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, చింతామోహన్, కనుమూరి బాపిరాజు, డాక్టర్ బత్తెయ్యనాయుడు, వేణుగోపాల్, సీపీఐ నేతలు ఎ.రామానాయుడు, పి.మురళి, రాధాకృష్ణ, చిన్నం పెంచలయ్య, శ్రీరాములు, జనమాల గురవయ్య, సీపీఎం నేత గఫూర్ తదితరులు పాల్గొన్నారు.