తెలంగాణ నుంచి ఐఏఎస్, ఐపీఎస్ల రిలీవ్
16లోగా రిపోర్టు చేయాలి
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ (డీఓపీటీ) షాక్ ఇచ్చింది. ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, రోనాల్డ్ రోస్, ఆమ్రపాలి, వాణీప్రసాద్, మల్లెల ప్రశాంతితోపాటు ఐపీఎస్లు అంజనీకుమార్, అభిషేక్ మొహంతి, అభిలాష బిస్త్…ఏపీకి వెళ్లాలని ఆదేశించింది. వారంతా ఈనెల 16వ తేదీలోగా ఏపీలో రిపోర్టు చేయాలని కోరింది. వారంతా తెలంగాణకు కేటాయించాలని కేంద్రాన్ని కోరగా..వారి అభ్యర్థనను కొట్టిపారేసింది. తెలంగాణ నుంచి రిలీవ్ చేస్తున్నట్లు డీవోపీటీ వెల్లడిరచింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఏపీ, తెలంగాణలకు అధికారులను కేంద్రం సర్దుబాటు చేసింది. ఆ సమయంలో కొంత మంది అధికారులు మాత్రం అభ్యంతరాలను వ్యక్తం చేశారు. వివిధ కారణాలను చూపిస్తూ తమను తెలంగాణ కేడర్కు మార్చాలంటూ కోరారు. ఇదే విషయంపై గతంలో క్యాట్ను ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆశ్రయించారు. వారి అభ్యర్థనను అంగీకరించిన క్యాట్, అప్పట్లో వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. క్యాట్ తీర్పును వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టులో కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది. గత మార్చిలో దీనిపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు, అభ్యర్థనలను మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో అభ్యంతరాల పరిశీలనకు విశ్రాంత ఐఏఎస్ అధికారి దీపక్ను నియమించింది. ఆయన ఇచ్చిన నివేదిక ప్రకారం అధికారుల అభ్యర్థనలను తోసిపుచ్చుతూ తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. డీఓపీటీ ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణాకు చెందిన రాష్ట్ర ఐఏఎస్, ఐపీఎస్లు ఏపీకి రానున్నారు.