పలు రాష్ట్రాలకు ఐసీఎంఆర్ హెచ్చరిక
కరోనా థర్డ్వేవ్పై మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్తో సహా 9 రాష్ట్రాలకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) హెచ్చరిక జారీ చేసింది. వచ్చే 8 వారాలు అంటే 2 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలని కౌన్సిల్ తెలిపింది. మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మిజోరాం, హర్యానా, గుజరాత్, జార్ఖండ్, గోవా, తమిళనాడు, పశ్చిమ బెంగాల రాష్ట్రాలను ఐసీఎంఆర్ హెచ్చరించింది. పిల్లలు.. టీకాలు వేయించుకోని వ్యక్తులకు ఇందులో అత్యంత ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎయిమ్స్ భోపాల్ డైరెక్టర్ డాక్టర్ శర్మన్ సింగ్ మాట్లాడుతూ, కరోనా థర్డ్వేవ్ వస్తుందా లేదా అనేది ప్రజలపై ఆధారపడి ఉంటుందని, అందరికీ టీకాలు వేస్తే. కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తే, థర్డ్వేవ్ ముప్పును తప్పించుకోవచ్చని చెప్పారు. పిల్లలకు ఇంకా వ్యాక్సిన్ లేకపోవడం వల్ల వారు ఎక్కువగా ప్రమాదంలో ఉన్నారని ఆయన చెప్పారు. కాగా కరోనా థర్డ్వేవ్ పరిస్థితి వస్తే ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని ఎంపీ ఆరోగ్య శాఖ ఉప కార్యదర్శి బసంత్ కుర్రే తెలిపారు. పడకల నుండి ఆక్సిజన్ వరకు, ఆసుపత్రులలో ఏర్పాట్లు చేసినట్టు ఆయన తెలిపారు.