న్యూదిల్లీ : దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు దిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. జైలు నుంచి పాలన చేయకుండా కేజ్రీవాల్ను అడ్డుకోవాలని దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఇది కేవలం ప్రచారం కోసం దాఖలు చేసిన పిటిషన్ మాత్రమేనని వ్యాఖ్యానించింది. మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ జైలు నుంచే పాలన సాగిస్తున్నారు. జైలులో ఉంటూ సమర్థవంతమైన పాలన అందించలేరంటూ తక్షణమే పదవికి రాజీనామా చేయాలని కొంతమంది డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ రాజీనామా చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కొందరు కోర్టుకు వెళ్లారు. ఆప్ మాజీ ఎమ్మెల్యే సందీప్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు ధర్మాసనం ఇది కేవలం పబ్లిసిటీ కోసం చేసిన పని అని వ్యాఖ్యానించింది. ఈ మేరకు జస్టిస్ ప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దిల్లీ ఎక్సైజ్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం కేజ్రీవాల్ జైలు నుంచే పాలన సాగిస్తున్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తించడంలో కేజ్రీవాల్ అసమర్థత కలిగి ఉన్నారని ఆరోపిస్తూ సందీప్ కుమార్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలోనూ కేజ్రీవాల్ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను హైకోర్టు తిరస్కరించింది. ఈ నెల నాలుగున తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్, జస్టిస్ మన్మీత్ పీఎస్ అరోరాతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై పిటిషన్ను స్వీకరించేందుకు నిరాకరించింది, ముఖ్యమంత్రిగా కొనసాగడం…కొనసాగకపోవడం అనేది కేజ్రీవాల్ వ్యక్తిగత అభిప్రాయమని స్పష్టం చేసింది.