. పోతిన మహేశ్ రాజీనామా… రాజోలులో బొంతు నిరసన
. పవన్పై ఈసీకి నవరంగ్ కాంగ్రెస్ ఫిర్యాదు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దే ఎన్డీయే కూటమిలోని జనసేన పార్టీకి షాక్లు మీద షాక్లు తగులుతున్నాయి. ఈనెల 10, 11 తేదీల్లో చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈలోగానే జనసేన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి పోతిన మహేశ్ ఆ పార్టీకి రాజీనామా చేసి పవన్కు గట్టి షాక్ ఇచ్చారు. ఎన్డీయే కూటమి పార్టీల పొత్తులు, సీట్ల సర్దుబాటులో భాగంగా విజయవాడ పశ్చిమ సీటును బీజేపీకి కేటాయించారు. దీంతో ఆ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ సుజనా చౌదరిని నియమించడంపై పోతిన తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. చివరి నిమిషం వరకు విజయవాడ పశ్చిమ సీటు తనకు కేటాయించాలంటూ పవన్ కల్యాణ్కు విజ్ఞప్తులు చేసినా స్పందన లేదు. తన అనుచరులతో కలిసి ఆందోళనలు, నిరసనలు చేసినా, ఎన్డీయే కూటమి నేతలు వెనక్కి తగ్గలేదు. దీంతో జనసేనకు ఆయన రాజీనామా చేసి పవన్, నాదెండ్ల మనోహర్ తీరును ఎండగట్టారు. రాజోలు సీటుపైనా వివాదం నెలకొంది. రాజోలు జనసేన సీటును వరప్రసాద్కు కేటాయించడంపై అక్కడ బొంతు రాజేశ్వరరావు వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వరప్రసాద్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, కరపత్రాలను పంపిణీ చేయడం వివాదస్పదంగా మారింది. ఇటీవల జనసేనకు అమలాపురం ఇన్ఛార్జి రాజీనామా చేశారు. కాకినాడ రూరల్,
పిఠాపురం, విజయవాడ తూర్పు తదితర నియోజకవర్గాల్లో జనసేనకు సీట్లు దక్కని వారంతా పార్టీని వీడుతున్నారు. అవనిగడ్డ అసెంబ్లీ సీటును టీడీపీ నుంచి వచ్చిన మండలి బుద్ధప్రసాద్కు కేటాయించడంపై అక్కడి స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నారు. జనసేన సోషల్ మీడియా ప్రచారంలో టీడీపీ, బీజేపీ నేతల ఫోటోలు ఎక్కడా కన్పించడం లేదు. కేవల జనసేన పోటీ చేసే స్థానాలకే పవన్ కల్యాణ్ ప్రచారం పరిమితమైంది. పొత్తు ధర్మంలో భాగంగా మిగిలిన నియోజకవర్గాలకు ఆయన వెళ్లడం లేదన్న విమర్శలున్నాయి. మొత్తంగా ఎన్నికల సమయానికి జనసేన పార్టీ పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితి ఉందని అసమ్మతి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
పవన్ను టెన్షన్ పెడుతున్న బక్కెట్టు గుర్తు
జనసేన పార్టీకి ఫ్రీ సింబల్ పెద్ద సమస్యగా మారింది. దీనికితోడు మరో బక్కెట్ గుర్తు ఉన్న నవరంగ్ కాంగ్రెస్ పార్టీ పవన్ను టెన్షన్కు గురిచేస్తోంది. జనసేనకు చెందిన గాజు గ్లాసు గుర్తు, దానికి దగ్గరగా బక్కెట్ గుర్తు ఉంటుంది. జనసేన నేత పవన్ కల్యాణ్పై కేంద్ర ఎన్నికల సంఘానికి నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు షేక్ జలీల్ ఫిర్యాదు చేశారు. బక్కెట్ గుర్తు ఉన్న నవరంగ్ పార్టీని పోటీ చేయవద్దని పవన్ తనను బెదిరిస్తున్నారంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. పవన్ కల్యాణ్పై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. పవన్తోపాటు ఎంపీ బాలశౌరి, నాదెండ్ల మనోహర్పై ఆయన ఫిర్యాదు చేశారు. తనకు రూ.ఐదు కోట్లు ఇస్తానని పవన్ చెప్పారని, అయినా వారి ప్రలోభాలకు లొంగలేదని, తామంతా జేడీ లక్ష్మీనారాయణ నాయకత్వంలో యునైటెడ్ ఫ్రంట్గా పోటీ చేస్తున్నామని వివరించారు. తనను బెరిరిస్తున్న పవన్ కల్యాణ్ను వెంటనే అరెస్టు చేయాలని కోరారు.