స్టాక్హోమ్ : ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ శాంతి బహుమతి జపాన్కు చెందిన నిహాన్ హిడాంక్యో సంస్థను వరించింది. జపాన్లోని హిరోషిమా, నాగసాకిల్లో అణుదాడి నుంచి బయటపడిన బాధితుల పక్షాన ఈ సంస్థ పోరాడుతోంది. ప్రపంచాన్ని అణ్వాయుధ రహితంగా మార్చేందుకు కృషి చేస్తుండటంతోపాటు బాధితుల జీవితగాథలను ఉదహరిస్తూ మరోసారి అణ్వాయుధాలు వాడకుండా ప్రయత్నాలు చేస్తున్నందుకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. ‘హిరోషిమా, నాగసాకి అణుబాంబు నుంచి ప్రాణాలతో బయటపడిన వారు శారీరక సమస్యలు, విషాద జ్ఞాపకాలతో జీవిస్తున్నప్పటికీ వారిని గౌరవించాలని భావిస్తున్నాం. శాంతి, విశ్వాసం పెంపొందించడానికి వారి విలువైన అనుభవాలను ఉపయోగించుకునేందుకు శాంతి బహుమతిని ఇవ్వాలని నిర్ణయించాం’ అని నోబెల్ బృందం పేర్కొంది. జపాన్ నగరాల్లో అణ్వాయుధాల బారిన పడిన బాధితుల ఉద్యమాన్ని హిబాకుషాగా పేర్కొంటారు. దీనిలో జపాన్కు చెందిన 47 రాష్ట్రాల్లో పోరాడుతున్న సంస్థల ప్రతినిధులు ఉన్నారు.
మరోవైపు, వైద్య విభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రదానం అక్టోబర్ 14 వరకు కొనసాగనుంది. వైద్య, భౌతిక, రసాయన శాస్త్రాలతోపాటు సాహిత్యంలో నోబెల్ గ్రహీతల పేర్లను ఇప్పటికే వెల్లడిరచగా… శుక్రవారం నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించారు. అక్టోబర్ 14న అర్థశాస్త్రంలో నోబెల్ గ్రహీతల పేర్లు వెల్లడిస్తారు.