. ఎనిమిది జిల్లాలకు వాయు‘గండం’
. పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు
. జనజీవనం అస్తవ్యస్తం
. భారీగా పంట నష్టం
విశాలాంధ్ర నెట్వర్క్: బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో కొద్ది రోజులుగా నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక చోట్ల లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడిరది. పంటలు నీట మునిగి తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. అనేక ప్రాంతాల్లో వరద బాధితుల కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు.
తిరుపతి జిల్లా అతలాకుతలం
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట, పెళ్లకూరు, తడ, ఓజిలి దొరవారిసత్రం, సూళ్లూరుపేట మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంతాలైన సూళ్లూరుపేట, తడ, చిట్టమూరు, కోట వాకాడు మండలాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పునరావాస కేంద్రాలు పరిశీలించారు. బాధితులకు అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఏర్పేడు మండలంలోని పాపా నాయుడుపేట-గుడిమల్లం ప్రధాన రహదారిపై సీతకాలువ వాగు వరద చేరడంతో కాజ్వే పై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. స్వర్ణముఖి నదికి వరద పోటెత్తడంతో ఏర్పేడు-మోదుగులపాలెం కాజ్వే పై వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు.
తిరుమలలో… రెండో రోజూ వర్షం దంచికొట్టింది. పాపవినాశనం, ఆకాశగంగ, శ్రీవారి పాదాలు, శిలాతోరణం వెళ్లే మార్గాల్లో భక్తుల వాహన రాకపోకలను నిలిపివేశారు. రెండో కనుమదారిలో రెండు, మూడుచోట్ల బండ రాళ్లు స్వల్పంగా రోడ్డుపైకి జారిపడగా వాటిని వెంటనే ఘాట్ రోడ్డు సిబ్బంది తొలగించి ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. శ్రీవారి సన్నిధిలో చలితీవ్రత అధికంగా పెరిగింది. వర్షంతో శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లడ్డూ విక్రయ కేంద్రాలకు, గదులకు వెళ్లే భక్తులు టీటీడీ ఏర్పాటు చేసిన షెడ్ల వద్ద తలదాచుకుంటున్నారు. తిరుపతి నగరంలోనూ జోరువాన కురిసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షం కారణంగా శ్రీవారి మెట్టు మార్గాన్ని తాత్కాలింగా మూసివేశారు. చిత్తూరు జిల్లాలో… చిందేపల్లి, ముళ్లపూడి, గుండ్లపల్లి, చింతలపాలెం ఎస్టీ కాలనీలోకి నీరు చేరాయి. అధికారులు వరద బయటకు పంపేలా చర్యలు తీసుకున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావస కేంద్రాలకు తరలించారు. వెంకటగిరి నియోజకవర్గంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం ఎక్కడిక్కడ స్తంభించింది.
వైఎస్ఆర్ జిల్లాలో… విస్తారంగా వానలు కురుస్తున్నాయి. కడప జలదిగ్బంధమైంది. ఎడతెరిపిలేని వర్షాలకు రహదారులన్నీ నీటితో నిండిపోయాయి. కోటిరెడ్డి సర్కిల్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు, కోర్టు ఎదురుగా, ఆర్.ఎం. కార్యాలయం వద్ద రహదారులన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై నీటిని అధికారులు యంత్రాల ద్వారా బయటికి తరలించే ప్రయత్నం చేశారు. అనేక కాలనీల్లోకి, లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరింది. కడప ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణమంతా మోకాళ్లలోతు నీటితో నిండిపోవడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని విద్యాసంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. కమలాపురంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ వరద చేరింది. పులివెందుల నియోజకవర్గంలో ఏకధాటిగా కురిసిన వానకి డ్రైనేజీలు పొంగి రోడ్లపై ప్రవహించాయి. వరి, అరటి, శనగ పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. ఒంటిమిట్ట, పోరుమామిళ్ల, వేంపల్లె, కడప మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. పోరుమామిళ్లలో 90 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జమ్మలముడుగు నియోజకవర్గంలోనూ జోరువానలు కురిశాయి. గండికోట జలాయశం నుంచి మైలవరానికి, అక్కడి నుంచి నాలుగేట్ల ద్వారా పెన్నా నదికి నీటిని విడుదల చేశారు.
అన్నమయ్య జిల్లాలో… 30 మండలాల్లో భారీ వర్షం కురిసింది. ప్రధానంగా రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. రైల్వే కోడూరు సమీపంలో గుంజునేరు ఉద్ధృతితో నరసరాంపేట, ధర్మాపురం వాసులు ఆందోళన చెందుతున్నారు. నందలూరు, పెనగలూరు చిట్వేలి, కోడూరు, మదనపల్లె, మండలాల్లో భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాయచోటి, మదనపల్లి, పీలేరు నియోజకవర్గాల్లోనూ ఎడతెరిపిలేని వానలతో జనజీవనం స్తంభించింది. రాజంపేటలో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రాజంపేట, రాయచోటి, మదనపల్లి పురపాలికలలో మురుగునీటి కాలువలు పొంగిపొర్లాయి. అన్నమయ్య జిల్లా కలెక్టర్ డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించి చెరువుల గట్లు పరిశీలించి అధికారులకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రకాశం జిల్లా… నాగులుప్పలపాడు మండలం చదలవాడ చెరువుకట్ట తెగి జాతీయ రహదారి పైకి భారీగా వరద నీరు పారుతుండటంతో వాహనాల రాకపోకలు మళ్లింపు చేపట్టారు.
నెల్లూరు జిల్లాలో… ఆత్మకూరులో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. కోలగట్ల, పీర్లగుడిపాడు, కరటంపాడు, అప్పారావుపాలెం, పడమటి కంభంపాడులో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ముందస్తుగా బోట్లు, గజ ఈతగాళ్లను సిద్ధం చేశారు. మర్రిపాడు చెరువుకు గండి పడుతుందేమోనని ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేశారు. చేజర్ల మండలం గొల్లపల్లి వద్ద పందల వాగు, చేజర్ల-తూర్పుకంభంపాడు మధ్య నల్లవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం కలిగింది.
కాగా సోమశిల జలాశయానికి వరద పోటెత్తింది. సంగం బ్యారేజీ 12 గేట్లు ఎత్తి సముద్రంలోకి నీరు విడుదల చేస్తున్నారు. పెన్నా పరివాహక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. తీర ప్రాంతాలను కలెక్టర్ ఆనంద్ పరిశీలించారు. మత్స్యకార గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏదైనా అవసరమైతే వెంటనే టోల్ఫ్రీ నంబర్కు కాల్ చేయాలని చెప్పారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలో ఎక్కడా ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. ముంపునకు గురైన ఇళ్లల్లోని వారిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు చెప్పారు. మరో 48 గంటల పాటు ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.
కర్నూలు జిల్లాలో… గత రెండు రోజుల నుండి కర్నూలు, నంద్యాల జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా కుందూ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పంటలు నీట మునగగా, మట్టిమిద్దెలు, భారీ వృక్షాలు కూలుతుండటంతో ప్రజలు భయబ్రాంతులు అవుతున్నారు. అధికారులు ముందు జాగ్రత్తగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటి ంచారు. కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా నంద్యాల జిల్లాలోని ఉయ్యాలవాడ, కోవెలకుంట్ల, చాగలమర్రిలలో కుందూనది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అక్కడి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. భారీ వర్షాలకు పంటలు నీట మునిగాయి. ధాన్యం తడిసి ముద్దయింది. పాములపాడు, నందికొట్కూరు, జూపాడుబంగ్లా, పగిడ్యాల మండలాల్లో మొక్కజొన్న పంట కోత కోయడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కర్నాటకలో తుంగభద్ర డ్యాం గేట్లు ఎత్తి నీరు విడుదల చేస్తుండటంతో కేసీ కెనాల్కు వరద పోటెత్తుతోంది. సుంకేసుల డ్యామ్ కు భారీగా నీరు వచ్చి చేరింది. తొడేండ్లపల్లి గ్రామంలో కంది, మొక్కజొన్న,పత్తి పంటలు నీట మునిగాయి. జిల్లాలో పత్తిపంట తీవ్రంగా దెబ్బతింది.
అనంతపురంలో… ఎడతెరిపిలేని వానలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నడిమి వంక ప్రాంతంలో కాలువకు నీరు చేరుతోంది. ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా వర్షం కురిసింది. గుత్తి పట్టణం చెర్లోపల్లి కాలనీలో ఓ ఇంటి పైకప్పు కూలింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.