ఇతర ప్రాంతాల్లో ఉద్యోగ వ్యాపార రీత్యా స్థిరపడిన వారు దసరా పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకునేందుకు సొంత ఊళ్లకు తరలివస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు సొంత గ్రామాలకు కుటుంబ సమేతంగా బయలుదేరడంతో రద్దీ పెరిగింది. బస్ కాంప్లెక్స్లు, రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: ఇతర ప్రాంతాల్లో ఉద్యోగ వ్యాపార రీత్యా స్థిరపడిన వారు దసరా పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకునేందుకు సొంత ఊళ్లకు తరలివస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు సొంత గ్రామాలకు కుటుంబ సమేతంగా బయలుదేరడంతో రద్దీ పెరిగింది. బస్ కాంప్లెక్స్లు, రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. పండుగ సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. ప్రత్యేక సర్వీసుల ద్వారా ప్రయాణికులు తరలివెళుతున్నారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. మరో పక్క ప్రైవేటు బస్ సర్వీసులు కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. వరుస సెలవులతో స్వగ్రామాలకు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో అందుకు అనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసింది. మరో పక్క పల్లె వెలుగు సర్వీసులు కూడా నిండిపోతున్నాయి. దసరా సెలవుల మూలంగా ప్రయాణీకుల రద్దీ పెరగడంతో మూడు రోజులుగా ఆక్యుపెన్సీ దాదాపు 80 శాతం వరకు పెరిగిందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. మరో రెండు రోజులపాటు రద్దీ కొనసాగే అవకాశం ఉండడంతో అవసరమైన మేర సర్వీసులను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాగా ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో విజయవాడ నగరంలో ప్రయాణికుల రద్దీతో వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభిస్తోంది. దసరా ఉత్సవాలు ముగిసిన తర్వాత 13వ తేదీ నుండి హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం రెగ్యులర్ సర్వీసులతో పాటు ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడిరచారు.