. తెలంగాణను ధ్వంసం చేసిన కేసీఆర్
. బీఆర్ఎస్ అంటే బీజేపీ రిస్తేదార్ పార్టీ
. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతువులకు రూ.4 వేల పింఛన్
. పొంగులేటిని కాంగ్రెస్లోకి ఆహ్వానించిన రాహుల్
విశాలాంధ్ర – ఖమ్మం/హైదరాబాద్ : దేశ ప్రజలను ఐక్యంగా ఉంచడమే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కొంతమంది స్వార్థ ప్రయోజనాలు, అధికారం కోసం దేశ ప్రజలను విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆదివారం ఖమ్మంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీలో చేరిక సందర్భంగా జరిగిన తెలంగాణ జనగర్జన భారీ బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముందుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పారు. పొంగులేటి వెంట వచ్చిన అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు, కొత్తగూడెం జడ్పీ చైర్మన్, అనేక మంది సర్పంచులు తదితరులను పార్టీలోకి రాహుల్ ఆహ్వానించారు.
అనంతరం ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు 1360 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన భట్టి విక్రమార్కను ఆయన అభినందించి, ఘనంగా సన్మానించారు. ఎండలను, వానలను, అనారోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజల కోసం వారిలో మమేకమై పాదయాత్ర నిర్వహించడం ద్వారా కాంగ్రెస్ భావజాలాన్ని సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లినందుకు భట్టిని రాహుల్ గాంధీ ప్రత్యేకంగా అభినందించారు. కాంగ్రెస్ భావజాలాన్ని అర్థం చేసుకొని, సిద్ధాంతాలను నమ్మి కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డిని హృదయపూర్వకంగా అభినందించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సభాధ్యక్షత వహించగా ఎంపీ ఉత్తమ్ కుమార్రెడ్డి రాహుల్ ప్రసంగాన్ని తెలుగులోకి అనువాదించారు. సభను ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి బీ టీమ్గా ఉన్న బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందని, ఇక్కడ బీజేపీ కతం అయ్యిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతువులకు రూ.4 వేల పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చారు. అనేక ఆశలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం ప్రజలు సంతోషంగా లేరని అన్నారు.
అధికారంలో ఉన్న కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ధ్వంసం చేసిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఉన్న సంపదను దోచుకోవడం, దాచుకువడం అనే ఒకేఒక్క సిద్ధాంతంపై ఈ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ భూములను దోచుకోవాలనే లక్ష్యంతోనే ధరణిని తీసుకువచ్చారన్నారు. నేటికీ లక్షల మంది రైతులకు పాసుపుస్తకాలు రాక అనేక అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు.
ప్రాజెక్టుల పేరుతో కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని, అలాగే చెరువుల పునరుద్ధరణ పేరుతో తీసుకువచ్చిన మిషన్ భగీరథలో కూడా రూ.వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. చాలాకాలంగా పెండిరగ్లో ఉన్న పోడు భూముల సమస్యకు కాంగ్రెస్ పార్టీ శాశ్వత పరిష్కారం చూపుతుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పోడు భూములన్నీ గిరిజనులకు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. కర్నాటకలో మాదిరిగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఖిల్లా అని, మీ మనసుల్లో, మీ రక్తంలో కాంగ్రెస్ ఉందంటూ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.
బీఆర్ఎస్ అంటే బీజేపీ రిష్తేదార్ పార్టీ
బీఆర్ఎస్ అంటే బీజేపీ రిష్తేదార్ పార్టీ అని రాహుల్ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ తెలంగాణకు తాను ఓ రాజుగా భావిస్తున్నారని, ఈ రాష్ట్రం ఆయన జాగీరు అనుకుంటున్నారంటూ మండిపడ్డారు. సమాజంలో అన్ని వర్గాలను కేసీఆర్ దోచుకున్నారని, పార్లమెంటులో బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్గా పని చేసిందని ఆరోపించారు. గతంలో రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ పోరాడితే బీఆర్ఎస్ మాత్రం మోదీ సర్కారుకు మద్దతుగా నిలిచిందని గుర్తు చేశారు. కేసీఆర్ రిమోట్ ప్రధాని మోదీ చేతిలో ఉందన్నారు. వరంగల్లో కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్, హైదరాబాద్లో యూత్ డిక్లరేషన్ ప్రకటించిందని తెలిపారు. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ ఒక అవినీతి ప్రభుత్వాన్ని ఓడిరచిందని, అక్కడ రైతులు, ఆదివాసీలు, పేదలు అందరూ కాంగ్రెస్ పక్షాన నిలిచారన్నారు. తెలంగాణలో కూడా ఇదే జరగబోతోందని అన్నారు. తెలంగాణలో బీజేపీ పని అయిపోయిందని, మొదట్లో ఇక్కడ ముక్కోణపు పోటీ అనుకున్నారు కానీ ఇపుడు బీజేపీకి బీఆర్ఎస్ బీటీమ్గా మారడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ఉండబోతుందన్నారు. బీఆర్ఎస్తో కాంగ్రెస్కు ఎలాంటి ఒప్పందం ఉండదని స్పష్టం చేశారు. కేసీఆర్ అవినీతికి ప్రధాని మోదీ అండదండలే కారణమని, కేసీఆర్ ఏ స్కామ్లు చేశారో కేంద్ర దర్యాప్తు సంస్థలకు, మోదీకి తెలుసునని అన్నారు. ఇటీవల బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీలు ఏకం అయ్యేందుకు ఏర్పాటు చేసిన సభకు కాంగ్రెస్ పార్టీని, బీఆర్ఎస్ని ఆహ్వానించగా బీఆర్ఎస్ను ఆహ్వానిస్తే కాంగ్రెస్ ఆ సమావేశానికి రాదని తాను చెప్పానని రాహుల్ తెలిపారు. ఈ జన గర్జన మహా బహిరంగ సభకు ఖమ్మం నగరానికి జన సునామి వచ్చినట్లు కనిపించింది. లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారు. ఖమ్మం నగరం కాంగ్రెస్ జెండాలతో నిండిపోయింది. సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లోనూ, నాయకుల్లోనూ నూతన ఉత్సాహం కనిపించింది. ఈ కార్యక్రమంలో మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రసంగించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యరావు ఠాక్రే, మధు యాష్కీ గౌడ్, వి.హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు పువ్వాళ దుర్గాప్రసాద్, రేణుక చౌదరి తదితరులు పాల్గొన్నారు.