. కొల్లి నాగేశ్వరరావు వర్థంతి సభలో వక్తల పిలుపు
. పోలవరంపై మోదీ మోసపూరిత వ్యాఖ్యలు: రామకృష్ణ
. నీటిని వాణిజ్య సరుకుగా మార్చారు: శ్రీనివాసరావు
. ఏపీ నీటి హక్కుల కోసం పోరాటం: లక్ష్మీనారాయణ
. రైతు ఉద్యమ నాయకుడు కొల్లి నాగేశ్వరరావుకు నివాళులు
విశాలాంధ్రవిజయవాడ: రాష్ట్రంలో సాగు, తాగు, పరిశ్రమల అవసరాల కోసం నదీ జలాల హక్కులు కాపాడుకోవటానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అవసమైతే పోరాటాలకు సిద్ధం కావాలని వక్తలు అభిప్రాయపడ్డారు. రైతు, కమ్యూనిస్టు ఉద్యమ నాయకులు కొల్లి నాగేశ్వరరావు 4వ వర్థంతిని పురస్కరించుకుని విజయవాడలోని దాసరిభవన్లో ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సుల్లో ‘కృష్ణా జలాల హక్కుల పరిరక్షణ
కొత్త ప్రభుత్వం ముందున్న సవాలు’ అనే అంశంపై వక్తలు ప్రసంగించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు నల్లచట్టాలను వ్యతిరేకిస్తూ దిల్లీ సరిహద్దులో ఏడాదికిపైగా రైతాంగం చేసిన పోరాటం చారిత్రాత్మకమన్నారు. ఆంధ్రప్రదేశ్లో రాజధాని అమరావతి రైతులు, విశాఖ స్టీల్ప్లాంట్ కార్మికులు చేసిన ఉద్యమాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. ఎన్నికల ముందు ఎన్డీఏకు 400 సీట్లు వస్తాయనే ధీమాతో ఉన్న ప్రధాని మోదీ…ఐదు దశల పోలింగ్ ముగిసిన అనంతరం ఆయన మాటల్లో మార్పు కనిపిస్తోందన్నారు. కృష్ణా జలాల విషయంలో కేంద్ర జలశక్తి మంత్రి చైర్మన్గా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్న అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు వినియోగించుకోవాలని బచావత్ ట్రిబ్యునల్ చెప్పిన దాన్ని అమలు చేయాలన్నారు. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన పోలవరాన్ని పూర్తి చేయకుండా మోదీ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. 2019 ఎన్నికల ప్రచారంలో పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎం కార్డులా వాడుకున్నారని చెప్పిన మోదీ…2024 ఎన్నికల ప్రచారంలో చంద్రబాబును పక్కన పెట్టుకుని జగన్కు రూ.15000 కోట్లు ఇస్తే పోలవరం కట్టుకుండా జాప్యం చేశారని చెప్పటం సిగ్గుచేటన్నారు. తనకు మరోసారి అధికారం ఇస్తే రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తామని మోసపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. గోదావరి జలాలపై నీటిఅథారిటీని ఏర్పాటు చేయటంలో కొల్లి నాగేశ్వరరావు ఎంతో కృషి చేశారన్నారు. కృష్ణా జలాలపైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో ఉన్న నీటి ప్రాధాన్యత అంశాల్లో మార్పు వచ్చిందని, నీరు వాణిజ్య సరుకుగా మారిందన్నారు. దీంతో నదీజలాలపై ఉన్న హక్కులను కేంద్రం తన నియంత్రణలోకి తీసుకుంటుందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా పెద్ద ప్రాజెక్టులపై దృష్టి పెట్టకుండా ఇంకుడు గుంతలు, చెక్డ్యామ్ల పేరుతో డబ్బులు దండుకున్నారన్నారు. మైనర్, మేజర్ నీటి ప్రాజెక్టులను అభివృద్ధి చేసి చెరువులు, కాల్వలను అనుసంధానం చేయాలన్నారు. నీటి పాలసీపై విధానాలు రూపొందించుకుని హక్కుల సాధనకు పోరాటాలు చేయాలన్నారు.
సామాజిక విశ్లేషకులు ‘కృష్ణా జలాల హక్కుల పరిరక్షణకొత్త ప్రభుత్వం ముందున్న సవాలు’ పుస్తక రచయిత టి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కొల్లి నాగేశ్వరరావు రైతాంగ ఉద్యమ నిర్మాణంలో ప్రముఖపాత్ర పోషించారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర నీటిపారుదల అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జల వనరులు, ప్రత్యేకించి నదీ జలాలు
ట్రిబ్యునల్స్ తీర్పులు, భారీ, మధ్య తరహా సాగునీటి పారుదల ప్రాజెక్టుపై లోతైన అధ్యయనం చేశారన్నారు. ప్రాజెక్టులవారీగా బచావత్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేసినా తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు అసంబద్ధంగా వాదిస్తూ కొత్త వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులను హరించే ప్రయత్నం జరుగుతోందని హెచ్చరించారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ నీటి హక్కుల కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.
రైతు సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ తీర్పు కృష్ణానది మిగులు జలాలను వినియోగించుకునే స్వేచ్ఛ లేకుండా చేసిందన్నారు. ట్రిబ్యునల్ తీర్పు చెప్పేనాటికి పూర్తికాని పులిచింతల జలాశయం నిల్వను లెక్కించిందన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, తుంగభద్ర జలాశయాల్లో పూడికవల్ల తగ్గిపోయిన నీటి నిల్వలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా తీర్పు ఇవ్వటంతో కృష్ణాజలాలపై హక్కు లేకుండా పోయిందన్నారు. రైతుసంఘం సీనియర్ నాయకులు వై.కేశవరావు మాట్లాడుతూ కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసుకుంటే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాజెక్టులకు మేలు జరుగుతుందన్నారు. ఉభయ రైతుసంఘాల అధ్వర్యంలో కృష్ణాడెల్లా పరిరక్షణ సమితి ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సభకు అధ్యక్షత వహించిన ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ కృష్ణానదీ జలాల హక్కులకు తీవ్ర ప్రమాదం ముంచుకొస్తున్న సందర్భంగా బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపును పరిరక్షించుకోవాల్సి ఉందన్నారు. మిగులు జలాల ఆధారంగా కరువు పీడిత రాయలసీమ ప్రాంతంలోనూ, ప్రకాశం జిల్లాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం చేపట్టిన తెలుగుగంగ, గాలేరు నగరి సుజల స్రవంతి, హంద్రీ నీవా, వెలిగొండ ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్ రైతుసంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ మాట్లాడుతూ కొల్లి నాగేశ్వరరావు జలవనరుల గురించి అధ్యయనం చేయటంతో పాటు సాగునీటి ప్రాజెక్టుల కోసం అలుపెరగని పోరాటం చేశారని కొనియాడారు. పోలవరం, పులిచింతల, కృష్ణాడెల్టా ఆధునీకరణ, గోదావరి జలాలను తెలంగాణ మెట్ట ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చారని చెప్పారు. రైతు నాయకులు అక్కినేని భవానీ ప్రసాద్, పల్లా రాజమోహన్, డి.హరినాథ్, సాంబశివరావు, మర్రెడ్డి వెంకటరెడ్డి, కొల్లా రాజ్మోహన్, వెలగపూడి ఆజాద్ తదితరులు ప్రసంగించారు.
టి.లక్ష్మీనారాయణ రాసిన ‘కృష్ణా జలాల హక్కుల పరిరక్షణ`కొత్త ప్రభుత్వం ముందున్న పెనుసవాల్’ పుస్తకాన్ని వై.కేశవరావు ఆవిష్కరించారు. ముందుగా కొల్లి నాగేశ్వరరావు చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇటీవల మరణించిన అఖిల భారత కిసాన్ సభ జాతీయ నాయకులు అతుల్ కుమార్ అంజాన్కు శ్రద్ధాంజలి ఘటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు పి.చంద్రనాయక్, కోశాధికారి ఆర్.పిచ్చయ్య రైతాంగ ఉద్యమ గీతాలు ఆలపించారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఓబులేసు, జంగాల అజయ్కుమార్, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రనాథ్, నాయకులు చలసాని రామారావు, సింహాద్రి రaాన్సీ, మల్నీడు యల్లమందరావు, మరీదు ప్రసాద్, శ్రీధర్, మహాదేవ్, జొన్నలగడ్డ రామారావు, సీహెచ్ కోటేశ్వరరావు, పరుచూరి రాజేంద్రబాబు, నక్కి లెనిన్బాబు, మోతుకూరి వెంకటేశ్వరరావు, జి.కోటేశ్వరరావు, దోనేపూడి శంకర్, నార్ల వెంకటేశ్వరరరావు, వై.చెంచయ్య, రావులపాలెం డిగ్రీ కాలేజీ విశ్రాంత ప్రిన్సిపల్ ఎన్.లక్ష్మణరావు, కొల్లి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.