నా వ్యాఖ్యల తొలగింపు ప్రజాస్వామ్య విరుద్ధం
లోక్సభ స్పీకర్కు రాహుల్ లేఖ
న్యూదిల్లీ:లోక్సభలో తాను చేసిన ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను రికార్డులనుంచి తొలగించడంపై ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. తొలగించిన వ్యాఖ్యలను వెంటనే పునరుద్ధరించాలని కోరారు. రాహుల్ గాంధీ సోమవారం లోక్సభలో చేసిన ప్రసంగంతో కమలనాధులు కంగు తిన్న విషయం తెలిసిందే. అయితే ఆయన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు ఎదురుకావడం వల్ల రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు లోక్సభ సచివాలయం ప్రకటించింది. దీనిపై స్పందించిన రాహుల్ మంగళవారం లోక్సభ స్పీకర్కు ఓ లేఖ రాశారు. ఈ చర్య పార్లమెంటరీ ప్రజాస్వామ్య నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ప్రసంగాన్ని ప్రస్తావించిన రాహుల్… ఆయన ఎన్ని ఆరోపణలు చేసినా ఒక్క పదాన్ని కూడా తొలగించలేదని గుర్తు చేశారు. ఇలా ఎంపిక చేసిన వ్యాఖ్యలను తొలగించడం సరికాదని, వాటిని వెంటనే పునరుద్ధరించాలని కోరారు. ‘‘సభా కార్యకలాపాల నుంచి అభ్యంతరకర వ్యాఖ్యలను తొలగించే అధికారం సభాపతికి ఉంటుంది. అయితే, లోక్సభ నిబంధనల ప్రకారం రూల్ 380 కింద వచ్చే పదాలను మాత్రమే తొలగించే హక్కు ఉంటుంది. కానీ, నేను చేసిన ప్రసంగంలో రూల్ 380 కిందకు వచ్చే పదాలను ఉపయోగించలేదు. అయినా సరే నా ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను తొలగించడాన్ని చూసి షాక్కు గురయ్యాను. నేను వాస్తవ పరిస్థితులు, నిజాలను మాత్రమే సభలో చెప్పాను. ఆర్టికల్ 105(1) ప్రకారం రాజ్యాంగం ఇచ్చిన హక్కు మేరకు ప్రతి ఒక్క సభ్యుడు ప్రజల గొంతును సభలో వినిపించాలి. ఇది ప్రతి ఒక్క సభ్యుడి హక్కు, దానినే నేను నిర్వర్తించాను’’ అని స్పీకర్కు రాసిన లేఖలో రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మరోవైపు పార్లమెంట్ సమావేశాలకు వెళ్లే ముందు కూడా రాహుల్ ఈ అంశంపై స్పందించారు. ప్రధాని మోదీ తన ప్రపంచంలోని నిజాలను తొలగించగలరు కానీ, వాస్తవ ప్రపంచంలో కాదని చెప్పారు. తాను ఏం చెప్పినా అది పూర్తిగా నిజమని స్పష్టం చేశారు. వారు ఎంత కావాలనుకుంటే అంత తొలిగించుకోవచ్చని…కానీ సత్యమే గెలుస్తుందన్నారు.
రాహుల్పై స్పీకర్కు నోటీసు
మరోవైపు రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్పీకర్కు నోటీసు ఇచ్చారు బీజేపీ ఎంపీ భాన్సురి స్వరాజ్. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే రూల్ 115 ప్రకారం రాహుల్ గాంధీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.