న్యూదిల్లీ: నీట్-యూజీ 2024 పరీక్ష పేపర్ లీక్ కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. దీనికి సంబంధించి అరెస్టులు మొదలుపెట్టింది. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న మనీశ్ ప్రకాశ్, అశుతోశ్ను బీహార్లోని పాట్నాలో అదుపులోకి తీసుకొంది. ఈ కేసులో లీకైన పేపర్ పొందిన విద్యార్థులను మనీశ్ తన కారులోనే తరలించినట్లు గుర్తించారు. వీరిలో రెండు డజన్ల మందికి అతడే ఒక రూమ్ బుక్ చేసినట్లు తెలుస్తోంది. ఇక రెండో నిందితుడైన అశుతోశ్ పేపర్ లీక్లో భాగస్వాములైన విద్యార్థులకు తన ఇంట్లోనే ఆశ్రయం కల్పించాడు. ఇప్పటికే పేపర్ లీక్కు సంబంధించి సీబీఐ క్రిమినల్ కేసు నమోదు చేసింది. దీంతోపాటు బీహార్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలు నమోదు చేసిన అభియోగాలను తమకు బదలాయించాలని నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే గుజరాత్లోని గోద్రా తాలుకా పోలీస్స్టేషన్లో మాల్ప్రాక్టీస్పై ఓ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ వ్యవహారంలో సీబీఐ మొత్తం ఆరు కేసులు దర్యాప్తు చేస్తోంది. నీట్-యూజీ 2024 పరీక్షను దేశవ్యాప్తంగా మే 5వ తేదీన నిర్వహించింది. దీనికి 24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పేపర్ బీహార్, గుజరాత్ రాష్ట్రాల్లో లీకైనట్లు ఇటీవల కాలంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మధ్యలోనే జూన్ 4న ఎన్టీఏ ఫలితాలు ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. దీంతో కేంద్రం కూడా ఈ వ్యవహారంపై దృష్టి సారించింది.
ఎన్టీఏకి సుప్రీంకోర్టు నోటీసులు
నీట్ ఫలితాల్లో విరుద్ధమైన మార్కులు ప్రకటించిన నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (ఎన్టీఏ)కి సుప్రీంకోర్టు గురువారం నోటీసులిచ్చింది. ఈ నోటీసులపై తదుపరి విచారణ చేపట్టనున్న జులై 8లోగా ఎన్టీఏ స్పందించాలని ఆదేశించింది. ఇటీవల నిర్వహించిన నీట్ పరీక్షల్లో రిగ్గింగ్ జరిగిందంటూ లెర్నింగ్ యాప్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. మే 5న నిర్వహించిన నీట్ పరీక్షల సమగ్రతపై ఈ పిటిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. జూన్ 4న వెల్లడిరచిన ఫలితాలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. 1500 మందికి పైగా అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులు అభ్యర్థుల ర్యాంకులు, పరీక్షల స్వచ్ఛతపై తీవ్ర ప్రభావం చూపాయని పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేశారు. రిగ్గింగ్, పేపర్ లీక్పై సీబీఐ కూడా విచారణ చేపడుతోంది.