దద్దరిల్లిన పార్లమెంటు
. వైద్య ప్రవేశ పరీక్షల్లో అక్రమాలపై చర్చించాల్సిందే
. ప్రతిపక్షాల పట్టు…అట్టుడికిన ఉభయసభలు
. రాజ్యసభలో స్పృహ కోల్పోయిన కాంగ్రెస్ సభ్యురాలు
న్యూదిల్లీ : నీట్ కుంభకోణంపై పార్లమెంటు దద్దరిల్లింది. ముందుగా చెప్పినట్లే నీట్ పరీక్షల్లో అవకతవకలపై తక్షణమే చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు పట్టు విడువకుండా ఆందోళన చేపట్టడంతో ఉభయ సభలు అట్టుడికాయి. లోక్సభలో నీట్ కుంభకోణంపై చర్చ చేపట్టాల్సిందేనని విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్తో కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి నినదించారు. సభను ప్రశాంతంగా సాగనివ్వాలన్న సభాపతి విజ్ఞప్తిని ప్రతిపక్షాలు ఖాతరు చేయకుండా చర్చ కోసం పట్టుబట్టడంతో తీవ్ర గందరగోళం నడుమ లోక్సభ సోమవారాని (జులై 1)కి వాయిదా పడిరది. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభమైన తర్వాత స్పీకర్ ఓం బిర్లా నీట్ వ్యవహారంపై ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రతిపక్ష ఎంపీలు ఒక్కసారిగా తమ స్థానాల నుంచి లేచి, నీట్పై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. స్పీకర్ అందుకు అంగీకరించకపోవటంతో పెద్ద పెట్టున ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. విపక్ష సభ్యుల నినాదాలతో గందరగోళం నెలకొనటంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 12 గంటలవరకు వాయిదా వేశారు. ఆ తర్వాత సభ సమావేశమైనప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవటంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. రాజ్యసభలోనూ అదే పరిస్థితి కొనసాగింది. ఈ క్రమంలో నీట్పై చర్చకు తాము సిద్ధమని కేంద్రం ప్రకటించింది. అయితే రాష్ట్రపతికి ధన్యావాదాలు తీర్మానం తర్వాతేనని భీష్మించింది.
వెనక్కి తగ్గని ప్రతిపక్షాలు
నీట్ పరీక్ష లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించినదని, దానిపై చర్చకు అనుమతి ఇవ్వాలని ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ స్పీకర్ను కోరారు. లోక్సభ సమావేశాలు ప్రారంభమైన వెంటనే విపక్ష సభ్యులు సభా కార్యకలాపాలు నిలిపి నీట్పై చర్చించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ అనంతరం ఈ అంశాన్ని లేవనెత్తవ చ్చని, తగినంత సమయం కూడా ఇస్తామని స్పీకర్ పేర్కొన్నారు. అయినా ప్రతిపక్ష సభ్యులు శాంతించ లేదు. ఈ గందరగోళం మధ్య, టీఎంసీ సభ్యుడు ఎస్కే నూరుల్ ఇస్లాం లోక్సభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు, ఉదయం సభ సమావేశమైనప్పుడు అన్ని వ్యవహారాలను నిలిపివేసి… నీట్కు సంబంధించిన విషయాలను చర్చించాలని వాయిదా తీర్మానాన్ని ఆమోదిం చాలని కోరుతూ తమ స్థానాల్లో నిలబడి నినదించారు.
అయితే లోక్సభ మాజీ స్పీకర్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి సహా 13 మంది మాజీ సభ్యుల సంతాప తీర్మానాన్ని తాను మొదట చేపడతానని స్పీకర్ చెప్పారు. ఈ కార్యక్రమం ముగియగానే విపక్ష సభ్యులు మళ్లీ లేచి నిలబడి… నీట్ అంశంపై చర్చకు పట్టుబట్టారు. ఈ దశలో స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ… ‘రోడ్డుపై నిరసనకు సభలో నిరసనకు మధ్య తేడా ఉంది… మీకు (ప్రతిపక్షం) సభ నడవడం ఇష్టం లేదా? ధన్యవాదాలు తీర్మానంపై చర్చలో నీట్ గురించి చర్చించకూడదా?’ అన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కూడా రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా ఈ అంశంపై చర్చించవచ్చని ప్రతిపక్ష సభ్యులకు తెలిపారు. ధన్యవాద తీర్మానాన్ని సభ చేపట్టే ముందు ప్రతిపక్షం ఒక అంశంపై చర్చకు డిమాండ్ చేయడం ఇదే మొదటిసారి అని అన్నారు. సభలో గందరగోళం కొనసాగడంతో సోమవారానికి వాయిదా వేశారు.
చర్చ జరగాల్సిందే: రాహుల్
నీట్ పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై పార్లమెంట్లో గౌరవప్రదంగా మంచి చర్చ జరిగేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కోరారు. దేశంలో నీట్ సమస్య అత్యంత ముఖ్యమైందని, అన్నింటికంటే ముందు దీనిపైనే పార్లమెంట్లో చర్చ జరగాలని రాహుల్ అన్నారు. విద్యార్థుల ఆందోళనలను ఉధృతం చేస్తున్నారని, ఈ సమయంలో ప్రభుత్వం, ప్రతిపక్షాలు కలిసి ఉన్నాయని, మీ సమస్యపై చర్చిస్తున్నాయని పార్లమెంటు ద్వారా యువతకు సందేశం పంపాలని రాహుల్ సూచించారు.
రాజ్యసభలోనూ…
నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై తక్షణమే చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యులు సభలో ఆందోళన చేయడంతో రాజ్యసభ కార్యకలాపాలు కూడా పదే పదే వాయిదా పడ్డాయి. నీట్ సమస్యపై చర్చ జరపాలని ప్రతిపక్ష సభ్యులు ఇచ్చిన నోటీసులను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ తిరస్కరించారు. చర్చ డిమాండ్ను ఆమోదించాలని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖడ్గే కోరినా చైర్మన్ అంగీకరించలేదు. కాగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. వెల్లోకి దూసుకెళ్లిన ప్రతిపక్ష సభ్యులు తిరిగి తమ స్థానాల్లో కూర్చోవాలని చైర్మన్ కోరినా వారు నిరాకరించారు.
మూడో వాయిదా అనంతరం సభ 2.30 గంటలకు ప్రారంభమైన తర్వాత కూడా ప్రతిపక్ష సభ్యులు నీట్పై చర్చకు పట్టుబట్టారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే సైతం వెల్లోకి వచ్చి నిరసన తెలిపారు. చివరకు ఇండియా ఐక్యసంఘటనకు చెందిన ప్రతిపక్ష సభ్యులందరూ సభ నుంచి వాకౌట్ చేశారు. వీరితో బిజూ జనతా దళ్ (బిజెడి) సభ్యులు కూడా జత కలిశారు. దీంతో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానాలపై చర్చ కొనసాగింది. అంతకుముందు నీట్ అవకతవకలపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీల సభ్యుల నిరంతర నినాదాల మధ్య రాజ్యసభ మూడవసారి మధ్యాహ్నం 2:20 గంటలకు 10 నిమిషాల పాటు వాయిదా పడిరది. రెండు వాయిదాల తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చను ముందుగా ప్రారంభించిన బీజేపీ నాయకుడు సుధాన్షు త్రివేది… ప్రతిపక్ష పార్టీల సభ్యులు పదేపదే అడ్డుతగులుతున్నప్పటికీ తన ప్రసంగాన్ని పూర్తి చేశారు. చర్చలో బీజేపీ సభ్యులు రాకేష్ సిన్హా, క్రిషన్ లాల్ పన్వార్, భీమ్ సింగ్ పాల్గొన్నారు. ఐదు దశాబ్దాల అనుభవం కలిగిన మల్లికార్జున ఖడ్గే వెల్లో కనిపించడం తనను ఆశ్చర్యపర్చిందని చైర్మన్ ధన్కర్ వ్యాఖ్యానించారు.