లంచం కేసుల్లో ఎంపీ, ఎమ్మెల్యేలనూ విచారించాల్సిందే
. స్పష్టం చేసిన విస్తృత ధర్మాసనం
. 1998 నాటి తీర్పు కొట్టివేత
న్యూదిల్లీ : ప్రజాప్రతినిధుల లంచాల కేసులో దేశ సర్వో న్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పార్లమెంటు, శాసనసభల్లో ఎవరైనా సభ్యులు అవినీతికి పాల్పడితే వారిని విచారించే విషయంలో ఎలాంటి మినహాయింపు లేదని ధర్మా సనం తేల్చి చెప్పింది. చట్టసభల్లో ప్రశ్నలు అడిగేందుకు, ప్రసంగించేందుకు, ఓట్లు వేసేందుకు లంచం తీసుకుంటే రక్షణ కల్పిం చలేమని చీఫ్ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మా సనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. ఈ మేరకు చట్టసభ్యులకు లంచం కేసుల్లో రాజ్యాంగ రక్షణ కల్పిస్తూ 1998లో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును విస్తృత ధర్మాసనం కొట్టేసింది. చట్ట సభల్లో ప్రసంగించేందుకు, ఓటు వేయడానికి లంచం తీసుకున్న సభ్యులు విచారణ ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు వెల్లడిరచింది. లంచానికి పార్లమెంటరీ అధికారాల ద్వారా రక్షణ లేదని 1998 నాటి సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగంలోని 105, 194 అధికరణలకు విరుద్ధమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. ప్రజా జీవితంలో విశ్వసనీయతను లంచం దెబ్బతీస్తుందని దీనిని ఉపేక్షించలేమని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ కేసు…
కొన్నేళ్ల క్రితం జరిగిన జార్ఖండ్ ముక్తి మోర్చా అవినీతి కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2012లో రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీ శాసనసభ్యురాలు సీతా సోరెన్ ఒక పార్టీ అభ్యర్థికి ఓటు వేయడానికి లంచం పుచ్చుకుని, మరొకరికి ఓటు వేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ క్రిమినల్ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆమె తొలుత జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తిరస్కరించడంతో సీతా సోరెన్ సుప్రీంకు వెళ్లారు. దీనిపై 2019లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు చట్టసభల్లో అవినీతికి పాల్పడినప్పుడు వారిపై చర్యలు తీసుకోవచ్చా? లేదా వారికి రక్షణ ఉంటుందా? అనే అంశం ఎంతో ప్రాముఖ్యమైనదని సుప్రీం ధర్మాసనం తెలిపింది. దాన్ని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసింది. అనంతరం ఈ కేసును చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారించింది. సభలో చేసే ప్రసంగాలు, అక్కడ వేసే ఓట్లపై ఎంపీలకు రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుందని పీవీ నరసింహారావు వర్సెస్ సీబీఐ కేసులో 1998లో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఇందుకోసం ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది.
తాజాగా విస్తృత ధర్మాసనం విచారణ జరిపి సోమవారం కీలక తీర్పు వెలువరించింది. 1993లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రభుత్వం అవిశ్వాసాన్ని ఎదుర్కొంది. ఆ సమయంలో జేఎంఎం ఎంపీగా ఉన్న శిబు సోరెన్ సహా ఇదే పార్టీకి చెందిన మరో నలుగురు ఎంపీలు లంచాలు తీసుకుని అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వీరి మద్దతుతో మైనార్టీలో ఉన్నప్పటికీ పీవీ ప్రభుత్వం గట్టెక్కింది. ఆ తర్వాత సోరెన్ సహా ఐదుగురు ఎంపీలపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసు సుప్రీంకోర్టుకు వెళ్లగా… సోరెన్ బృందానికి ఊరట లభించింది. ప్రజాప్రతినిధులకు లంచం కేసుల విచారణ నుంచి మినహాయింపునిస్తూ 1998లో అప్పటి ధర్మాసనం తీర్పు వెలువరించింది.
ప్రధాని మోదీ స్పందన
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ తీర్పు స్వచ్ఛమైన రాజకీయాలను నిర్ధరిస్తుందని, వ్యవస్థపై ప్రజలకు విశ్వాసాన్ని పెంపొందించేలా ఉందని ట్వీట్ చేశారు.