విశాలాంధ్ర-నూజివీడు టౌన్ : పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 2023-24 విద్యా సంవత్సరానికిగాను ముసునూరు మండలం రమణక్కపేట గ్రామానికి చెందిన ఆకుల వెంకట సాయి నాగ మనస్వి (599/600 మార్కులు) రాష్ట్రంలోనే ప్రథమ స్థానం సాధించింది. ఏలూరు జిల్లా నూజివీడులోని నారాయణ విద్యా సంస్థల్లో ఆమె పదో తరగతి ఇంగ్లీష్ మీడియంలో చదివారు. సెకండ్ లాంగ్వేజ్ హిందీలో మినహా మిగతా అన్ని సబ్జెక్టుల్లో నూటికి నూరు మార్కులు సాధించింది. తల్లిదండ్రులు నాగ వరప్రసాద్, శైలజ వృత్తిరీత్యా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు. విద్యార్థిని మనస్వి మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ర్యాంకు సాధించడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారం ఎంతో ఉందన్నారు. ఐఐటీలో సీటు సాధించడం తన లక్ష్యమన్నారు.