. సమర్థ యువత, స్నేహపూర్వక ప్రభుత్వం, మౌలిక వసతులు పుష్కలం
. పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ అన్నివిధాలా స్వర్గధామం వంటిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. పంచకులలో గురువారం జరిగిన హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి అతిథిగా సీఎం హాజరయ్యారు. అనంతరం ప్రధాని మోదీ అధ్యక్షతన చండీగఢ్లో ఎన్డీయే సీఎంల కౌన్సిల్ సమావేశం జరిగింది. ఏపీ నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరుకాగా, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అమిత్షా, రాజ్నాథ్సింగ్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవా, ఒడిశా, మణిపూర్, చత్తీస్గఢ్ సీఎంలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పెట్టుబడులు పెట్టడానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ ఆహ్వానమంటూ స్వాగతించారు. ఏపీ ఇప్పుడు అత్యుత్తమ పారిశ్రామిక విధానాలతో ఆహ్వానం పలుకుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ పూర్తిగా వ్యాపార అనుకూల రాష్ట్రమని చెప్పారు. కొత్త విధానాలను పరిశ్రమ అనుభవజ్ఞులతో రూపొందించామన్నారు. వ్యవస్థాపక స్ఫూర్తి, వ్యాపారాలను పెంపొందించడమే తమ లక్ష్యమని వెల్లడిరచారు. దేశంలో అత్యుత్తమ వ్యాపార పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తున్నామని, పారిశ్రామిక అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని హామీ ఇచ్చారు. దేశంలో, ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఇంతకంటే మంచి తరుణం లేదన్నారు. ఈ ఉత్తేజకరమైన వృద్ధి ప్రయాణంలో తమకు సహకరించాలని కోరారు. వ్యాపార పరిధులు, రాష్ట్ర సామర్థ్యం పరస్పరం విస్తరించుకునే అవకాశమిదని, నూతన పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్నామని చంద్రబాబు తెలిపారు. వ్యాపారాలకు పూర్తిగా సహకరించే ప్రభుత్వం, మరోవైపు ప్రతిభావంతులైన యువత, ఉత్తమ మౌలిక సదుపాయాలు ఏపీకి ఉన్న ప్రత్యేక అర్హతలుగా పేర్కొన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలతో చర్చించి కొత్త పాలసీలు తీసుకొచ్చినట్లు వెల్లడిరచారు. కొత్త పాలసీలు వేగవంతమైన వ్యాపార నిర్వహణకు దోహదం చేస్తాయన్నారు. తాము దేశంలో అత్యుత్తమ వ్యాపార వాతారణ వ్యవస్థను నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రంలో మీ వ్యాపారానికి ప్రభుత్వం పూర్తి సహాయసహకారాలు అందిస్తుందని తాను వ్యక్తిగతంగా హామీ ఇస్తున్నానని, రాష్ట్రంలో పెట్టుబడులతో మీ వ్యాపారం పెరుగుతుందని హామీ ఇచ్చారు.