నేరపూరిత పరువునష్టం కేసులో దోషిగా తేలడంతో.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వం రద్దు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రజాప్రతినిధుల చట్టంలోని సెక్షన్8(3)ను సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ వేశారు. ఆటోమెటిక్గా ప్రజాప్రతినిధుల్ని అనర్హులుగా ప్రకటించే సెక్షన్ 8 విషయంలో దిశానిర్దేశం చేయాలని సుప్రీంను ఆ పిటిషన్లో కోరారు. ఆ సెక్షన్ అక్రమంగా, ఏకపక్షంగా ఉందని పిటిషన్లో ఆరోపించారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(3) రాజ్యాంగ చెల్లుబాటును పిటీషనర్లు ప్రశ్నించారు.మోదీ ఇంటిపేరుతో దూషించిన కేసులో సూరత్ కోర్టు ఇటీవల రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఆ తీర్పులో ఆయన అప్పీల్ చేసుకునేందుకు నెల రోజుల వ్యవధిని కల్పించారు. కానీ తీర్పు వెలుబడిన 24 గంటల్లోపే.. రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ లోక్సభ సచివాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాహుల్పై వేసిన ఆ వేటును తెలంగాణ సీఎం కేసీఆర్తో పాటు మమతా బెనర్జీ, కేజ్రీవాల్, స్టాలిన్లు ఖండించారు.పీహెచ్డీ స్కాలర్, సామాజిక కార్యకర్త ఆబా మురళీధరన్ కోర్టులో పిటిషన్ వేశారు. సెక్షన్ 8(3)ను న్యాయసమ్మతం లేకుండా రూపొందించారని, అది రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేల భావ స్వేచ్ఛను ఆ చట్టం హరిస్తోందన్నారు. నియోజకవర్గ ప్రజలు తమ ఓట్లతో నేతల్ని ఎన్నుకున్నారని, కానీ ఆ చట్టం వల్ల ఆ నేత తన విధుల్ని సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నట్లు మురళీధరన్ తన పిటిషన్లో తెలిపారు. అడ్వకేట్ దీపక్ ప్రకాశ్ ద్వారా కోర్టులో ఆ పిటిషన్ దాఖలు చేయించారు. అడ్వకేట్ శ్రీరామ్ పరాకట్ కూడా ఆ పిటిషన్లో కొన్ని అభ్యర్థనలు చేశారు. 1951 చట్టంలోని సెక్షన్ 8, 8ఏ, 9, 9ఏ, 10, 10ఏ, 11కు భిన్నంగా సెక్షన్ 8(3) ఉన్నట్లు పిటిషన్లో పేర్కొన్నారు.