అభ్యర్థుల్లో టెన్ష్న్
. కౌంటింగ్కు సర్వం సిద్ధం
. ఏజెంట్లకు నేతల దిశానిర్దేశం
. భారీగా పోలీసు భద్రత
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది. మరో ఐదు రోజుల్లో మహాఘట్టానికి తెరపడనుంది. పోటీలో ఉన్న అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. నువ్వా…నేనా అన్న రీతిలో ఎన్నికల ప్రచారం సాగింది. ఫలితాలు ఎప్పుడెప్పుడా అన్న రీతిలో ఉత్కంఠగా మారగా… ఇక దానికి గడువు ఐదు రోజులే మిగిలింది. జూన్ ఒకటో తేదీన దేశ వ్యాప్తంగా మొత్తం పోలింగ్ ప్రక్రియ పూర్తికానుంది. అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రముఖ జాతీయ, ప్రాంతీయ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ను బహిరంగంగా వెల్లడిరచనున్నాయి. ఇప్పటికే చాలా సంస్థలు తమ అభిప్రాయాల్ని ఎన్నికల స్టడీ పేరుతో సామాజిక మాద్యమాల్లో ప్రకటిస్తున్నాయి. ప్రముఖ జాతీయ, ప్రాంతీయ ఎగ్జిట్ పోల్స్పై అన్ని పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రధాన సంస్థల ఎగ్జిట్ పోల్స్ వైసీపీ, ఎన్డీఏ కూటమి నేతల వద్దకు చేరినట్లుగా ప్రచారముంది. 2019 ఎన్నికల సమయంలో వెల్లడిరచిన అనేక సర్వే సంస్థలు అభిప్రాయాలు, ఫలితాలకు దగ్గరగా నిలిచాయి. ఇంతకుముందు జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలోను ప్రధాన సర్వే సంస్థలలో అత్యధికంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ ఓటమి పాలవుతారని సూచించగా, అవి ఫలితాల్లో వాస్తవాలకు దగ్గరగా నిలిచాయి. ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలనేతలు కేవలం ఎగ్జిట్ పోల్స్పైనే ఆధాపడకుండా తమకున్న ఓటు బ్యాకింగ్, సామాజిక బలబాలాలపైన అంచనాలు వేస్తున్నారు. ఎవరూ సర్వేలను నమ్మి బెట్టింగ్లకు దిగవద్దని పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు.
అటు జూన్ నాల్గో తేదీన కౌంటింగ్కు రాష్ట్ర ఎన్నికల సంఘం పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టింది. సీఈఓ ముఖేశ్కుమార్ మీనా, డీజీపీ హరీశ్కుమార్ గుప్తా సమస్యాత్మక ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్నారు. ఈ కౌంటింగ్కు రాజకీయ పార్టీలు సన్నద్ధమయ్యాయి. పోటాపోటీగా తమ ఏజెంట్లను నియమించాయి. రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంచారు. తొలుత ఉదయం ఎనిమిది గంటలకు సైనిక దళాలు, పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత నుంచి 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఈవీఎంలను తెరచి రౌండ్ల వారీగా లెక్కింపు ప్రారంభిస్తారు. మధ్యాహ్నం రెండు గంటల్లోపు 111 నియోజకవర్గాల ఫలితాలను ప్రకటిస్తారు. రాత్రి తొమ్మిది గంటల్లోపు మిగిలిన నియోజకవర్గాలను కలిపి తుది ఫలితాలను వెల్లడిస్తారు. 111 నియోజకవర్గాల్లో 20 రౌండ్లు, 61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్లు, మిగిలిన మూడు నియోజకవర్గాల్లో 25కుపైగా రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు. ఉదయం 11 గంటలకు మొత్తం ఫలితాలపై ఒక స్పష్టత వస్తుంది. ఓట్ల లెక్కింపు దగ్గర పడటంతో స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఉన్న ఈవీఎంల భద్రతపై నిఘా పెంచారు. ఇప్పటికే అన్ని చోట్లా మూడంచెల భద్రత కొనసాగుతోంది. పార్టీ నేతలంతా ఎన్నికల కౌంటింగ్కు ప్రధాన ఏజెంట్లను సిద్ధం చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో అనుసరించే శైలిపై వారికి తర్ఫీదు ఇస్తున్నారు. వైసీపీ ఏజెంట్లతో రెండు రోజులపాటు ఆ పార్టీ ముఖ్యనాయుడు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యక్తిగత, జూమ్ సమావేశాల్ని నిర్వహించారు. రిటైర్డ్ ఆర్డీఓ అధ్వర్యంలో వారికి కౌంటింగ్లో మెలగాల్సిన అంశాలపై శిక్షణ ఇప్పించారు. ప్రత్యర్థుల ఆగడాలను ఎదుర్కొనే దిశగా సజ్జల దిశానిర్దేశం చేశారు. దీని ఆధారంగా ఎంతటికైనా దిగాల్సిందేనన్న సంకేతాల్ని పరోక్షంగా వైసీపీ ఏజెంట్లకు జారీచేయడం విమర్శలకు దారితీస్తున్నది. ఎన్డీఏ కూటమి పార్టీకి చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కూడా కౌంటింగ్ ఏజెంట్లపై దృష్టి పెట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనను ముగించుకుని వచ్చిన వెంటనే ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అనుసరించాల్సిన అంశాలపై దృష్టి కేంద్రీకరించారు. పార్టీ నేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. టీడీపీ ముఖ్య కౌంటింగ్ ఏజెంట్లకు ఈనెల 31, జూన్ ఒకటిన శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కౌంటింగ్ రోజూ వైసీపీ కార్యకర్తలు పెద్దఎత్తున హింసకు తలెత్తే అవకాశముందని, భద్రతపై ఈసీ, డీజీపీకి లేఖ రాయాలని ఆయన సూచించారు. కౌంటింగ్ ముందు రోజు నుంచే నేతలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికల్లో తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగిన అభ్యర్థులు గెలుపు ఓటములపై ఆందోళన చెందుతున్నారు. వైసీపీ, ఎన్డీఏ కూటమి నుంచి చాలా మంది కొత్తగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మరికొందరు గతంలో పోటీ చేసి ఓటమి పాలై, ఈ సారి ఎలాగైనా అసెంబ్లీ గేటు దాటాలన్న లక్ష్యంతో ఉన్నారు. వారిలో ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నేతలకూ గెలుపు ఫీవర్ పట్టుకుంది.
ఎగ్జిట్ పోల్స్ తర్వాత బెట్టింగ్ల రెట్టింపు?
జూన్ ఒకటో తేదీ సాయంత్రం నుంచి వెలువడే జాతీయ, ప్రాంతీయ ప్రముఖ సంస్థల ఎగ్జిట్ పోల్స్ అనంతరం బెట్టింగ్లు భారీగా పెరిగే అవకాశముంది. అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు బెట్టింగ్లు కడుతున్నారు. కొందరు బుకీలుగా ఏర్పడి బెట్టింగ్లకు మధ్యవర్తులుగా వ్యవహరిస్త్నుట్లు సమాచారం. ఈనెల 13న ఎన్నికలు పూర్తయిన వెంటనే ఏపీ ఎన్నికలపై భారీగా బెట్టింగుల పర్వం మొదలైంది. ఒక్క ఉత్తరాంధ్రలోనే కోట్లకు బెట్టింగులు చేరాయి. వాటిని లెక్కించే అవకాశాలు లేనందున… గణాంకాలను వెల్లడిరచలేకపోతున్నారు. పార్టీల అధినేతలు, ముఖ్య నాయకులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై బెట్టింగులు ఊపందుకున్నాయి. ఇందులో ప్రధానంగా వైసీపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుంది, ఎన్డీఏ కూటమి గెలుస్తుందనే అంశాలపైనే అధికంగా బెట్టింగులు కొనసాగినట్లు సమాచారం. ఎగ్జిట్ పోల్స్ వరకు చూసి…బెట్టింగ్లు కట్టేందుకు కొందరు సిద్ధమయ్యారు.