. వైసీపీకి విద్యుత్ షాక్ తప్పదు
. రామకృష్ణ, శ్రీనివాసరావు, బొండా ఉమ హెచ్చరిక
విశాలాంధ్ర – విజయవాడ : విద్యుత్ ట్రూఆప్ చార్జీలు, సర్చార్జీలు, కస్టమర్ చార్జీల పేరుతో జగన్ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటుందని అఖిలపక్ష నేతలు విమర్శించారు. ప్రజలకు భారంగా మారిన విద్యుత్ చార్జీలను తక్షణం ఉపసంహరించుకోకుంటే బషీర్బాగ్ తరహా విద్యుత్ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. పెంచిన విద్యుత్ చార్జీలు, ట్రూఆప్ చార్జీలు, స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ సీపీఐ రాష్ట్ర సమితి విజయవాడ దాసరి భవన్లో గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. సమావేశానికి అధ్యక్షత వహించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి విద్యుత్ షాక్ తప్పదని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలను వైసీపీ ప్రభుత్వం అత్యంత ఉత్సాహంతో వేగవంతంగా అమలు చేస్తోందని విమర్శించారు. సర్దుబాటు చార్జీలు, ట్రూఅప్ చార్జీల పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వీరబాదుడుకు పాల్పడుతున్నారన్నారు. స్మార్ట్ మీటర్ల పేరుతో భారీ దోపిడీకి తెరలేపారని ఆరోపించారు. విద్యుత్ వినియోగదారులపై అధిక భారాలు మోపుతున్నారన్నారు. రాజస్తాన్, చండీగఢ్లలో రూ.7,100, రూ.7,900కు స్మార్ట్మీటర్లు లభిస్తుండగా, ఏపీలో ఒక్కో స్మార్ట్ మీటర్కు రూ.36,970 వెచ్చిస్తున్నారంటే ఇంతకన్నా దోపిడీ ఏముంటుందని ప్రశ్నించారు. విద్యుత్ ట్రూఅప్ చార్జీలు, సర్దుబాటు చార్జీలు ఎత్తివేయాలని, ప్రీపెయిడ్ స్మార్ట్మీటర్ల ఏర్పాటును ఉపసంహరించుకోవాలని, ప్రత్యేకించి షిర్డీసాయి కంపెనీ, అదానీ కంపెనీతో జరిగిన విద్యుత్ ఒప్పందాలను తిరిగి పరిశీలించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేరేంత వరకూ ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 18న వామపక్షాల అధ్వర్యంలో విజయవాడలో జరగనున్న రాష్ట్రస్థాయి సదస్సులో పాల్గొని విజయవంతం చేయాలని ప్రజలను కోరారు.
టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరిపై భారం వేసే అవకాశం కరెంటు చార్జీల ద్వారా జరుగుతుందన్నారు. పొరుగున గల తమిళనాడు, కర్నాటక, ఒడిశా రాష్ట్రాల్లో విద్యుత్ చార్జీలు ఎందుకు పెరగటం లేదన్నారు. వలంటీర్ వ్యవస్థ వచ్చిన తరువాత ఇళ్లలోకి ప్రవేశించి మీరు ఇది వాడుతున్నారు, అది వాడుతున్నారంటూ వేధిస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ చార్జీలు ఇష్టానుసారం పెంచిన జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న మీటర్లు బాగానే పని చేస్తున్నాయని, ఇక స్మార్ట్మీటర్లతో పనేమిటని ప్రభుత్నాన్ని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ ఏడు రకాలుగా విద్యుత్ చార్జీలు వసూలు చేస్తున్నారని, ఇది కిందస్థాయి అధికారులకు కూడా అర్థం కావటం లేదని తెలిపారు. విద్యుత్ కొనుగోలు అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. క్షేత్రస్థాయిలో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ జగన్ వవర్ దెబ్బకి వడదెబ్బ భయపడిరదని ఎద్దేవా చేశారు. 20 ఏళ్ల క్రితం బషీర్బాగ్ ఉద్యమం తరువాత టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యుత్ చార్జీల జోలికి వెళ్లలేదన్నారు. వినియోగదారుల ఆందోళనలకు రాజకీయ పార్టీలు మద్దతివ్వాలని సూచించారు. గ్రీన్ ఎనర్జీ పేరుతో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయటానికి ఎకరాల కొద్దీ భూములను అప్పనంగా కట్టబెడుతున్నారని ఆరోపించారు. రైతుకు ఏడాదికి కేవలం రూ.30 వేలు ఇస్తున్నారని, కంపెనీలకి 6 నుంచి 7 లక్షల రూపాయల ఆదాయం వస్తుందని తెలిపారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహించే పెద్ద పార్టీలను ఉద్యమంలోకి తీసుకురావాలన్నారు. అందరినీ కలుపుకొని మండలస్థాయిలో, గ్రామస్థాయిలో రౌండ్టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామ సచివాలయాలు, విద్యుత్ కార్యాలయాల్లో ప్రజల సంతకాలతో కూడిన వినతిపత్రాలు అందజేయాలన్నారు. సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర నాయకుడు డి.హరనాథ్ మాట్లాడుతూ వ్యవసాయ మీటర్లు బిగించినప్పుడు జియో టవర్లు దహనం చేసినట్లు గుర్తు చేశారు. స్మార్ట్ మీటర్లను ప్రతిఘటించాలని సూచించారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు కరెంటు చార్జీలు పెంచటానికి భయపడితే సీఎం జగన్ నాలుగేళ్లలో 8సార్లు పెంచారని విమర్శించారు. విద్యుత్కు సంబంధించి కృత్రిమ కొరత సృష్టించి బయట నుంచి కొనుగోలు పేరుతో ప్రజలపై భారాలు వేస్తున్నారని చెప్పారు. రాజకీయ వ్యవస్థలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మెత్స దుర్గాభవానీ మాట్లాడుతూ కరెంటు బిల్లులు ఎక్కువ వస్తే సంక్షేమ పథకాలలో కోత విధిస్తున్నారని మండిపడ్డారు. 200 యూనిట్లలోపు వాడే వినియోగదారులకు ఉచిత కరెంటు ఇస్తామని హామీ ఇచ్చి మాటతప్పారన్నారు. ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎంవీ ఆంజనేయులు, నవక్రాంతి పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం మాట్లాడారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి.ఈశ్వరయ్య ప్రవేశపెట్టిన విద్యుత్ ఉద్యమంపై కార్యాచరణ తీర్మానాన్ని రౌండ్టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ముందుగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ అతిథులకు స్వాగతం పలికారు. సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు వందన సమర్పణ చేశారు. తొలుత ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు చంద్ర నాయక్, కోశాధికారి ఆర్.పిచ్చయ్య అభ్యుదయ గీతాలు ఆలపించారు. టీడీపీ నేత, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీహెచ్ కోటేశ్వరరావు, డీహెచ్పీఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బుట్టి రాయప్ప, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ, సీపీఐ విజయవాడ నగర సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు పాల్గొ న్నారు. కాగా, రౌండ్టేబుల్ సమావేశం ప్రారంభించిన వెంటనే సమీపంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పేలి కరెంటు పోయింది. దీంతో నాయకులు సెల్ఫోన్ టార్చ్లు ఆన్చేసి సమావేశాన్ని కొనసాగించారు.