. ఏపీ టెట్కు జిల్లాలు దాటి పరీక్షా కేంద్రాలు
. ఒక్కో అభ్యర్థికి ఐదు ఆప్షన్లు
. ప్రాధాన్యతగా కేటాయింపు నిబంధన
. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం
. సొంత జిల్లాల్లోనే పరీక్షలు… లోకేశ్కు వినతి
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ఏపీ టెట్ (జులై, 2024)కు ఒక్కో అభ్యర్థికి జిల్లాలు దాటి ఐదు పరీక్షా కేంద్రాలను ఆప్షన్లుగా ఎంచుకోవాలన్న నిబంధన విధించడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఈ ఆప్షన్లలో ఉమ్మడి 13 జిల్లాలతోపాటు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ను అందుబాటులో ఉంచారు. ఉదాహరణకు ఉమ్మడి కృష్ణాజిల్లా విజయవాడకు చెందిన ఒక అభ్యర్థి దరఖాస్తు చేసే ప్రక్రియలో భాగంగా ఐదు జిల్లాలను ఖచ్చితంగా ఎంచుకోవాల్సిందిగా ఆప్షన్లు సూచిస్తున్నాయి. టెట్ దరఖాస్తుల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమైంది. ఈనెల మూడో తేదీ నుంచి ఆన్లైన్లో ఫీజులు చెల్లించిన అభ్యర్థులు జిల్లాల వారీగా టెట్కు దరఖాస్తు చేస్తున్నారు. తొలి రోజు నుంచే వివిధ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు తమ పేపర్ల వారీగా దరఖాస్తు చేశారు. ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందనని వారు… మొదటగా కృష్ణాజిల్లా పెట్టుకోగా, ఆ తర్వాత గుంటూరు, ప్రకాశం, రాజమహేంద్రవరం, నెల్లూరు ఇలా కొద్దిగా దగ్గరగా ఉన్న జిల్లాలతో ప్రాధాన్యతా క్రమంలో ఆప్షన్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో ముందు వరుసలో దరఖాస్తు చేసిన వారికే సొంత జిల్లాలో పరీక్షా కేంద్రం పడుతుందా?, ఆలస్యం చేస్తే ఇతర జిల్లాలకు తరలిపోతారా? అనేదీ ప్రశ్నార్థకంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ టెట్-2022, 2024 (ఫిబ్రవరి) పరీక్షల నిర్వహణలోను ఇదే తప్పిదం చేశారన్న విమర్శలున్నాయి. వేలాది మంది అభ్యర్థులకు జిల్లాలు దాటి నెల్లూరు, తిరుపతి, విశాఖపట్నంలాంటి దూర ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలను కేటాయించారు. కృష్ణాజిల్లాకు చెందిన అభ్యర్థి నెల్లూరు వెళ్లి రాయాలంటే ముప్పుతిప్పలు పడాల్సి ఉంటుంది. ఒక రోజు ముందే పరీక్షా కేంద్రం ఉన్న నగరానికి చేరుకుని, ఏదొక హోటల్లో బసచేసి, మరుసటి రోజు చేరుకోవాలి. అధిక దూరం ప్రయాణంతో అభ్యర్థులు అలసిపోయి…పరీక్షపై పూర్తిగా దృష్టి పెట్టలేరు. ప్రధానంగా ఏపీ టెట్ (తెలుగు) పేపర్-2 అభ్యర్థులు అందరినీ నెల్లూరు వేయడంతో నానా పాట్లు పడ్డారు. ఉభయగోదావరి జిల్లాల నుంచి కూడా ఎంతోమంది నెల్లూరుకు తరలివచ్చారు. ఇప్పుడు కూడా పరీక్షా కేంద్రాలకు ఐదు జిల్లాల ఆప్షన్లను ప్రాధాన్యతా క్రమంలో ఎంచుకోవాలని సూచించడంతో అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు. ఈ నెల రెండో తేదీన పరీక్షలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్కుమార్ నోటిఫికేషన్ జారీజేశారు. మూడో తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆన్లైన్లో అభ్యర్థులు ఫీజు చెల్లించాలి. 17వ తేదీ వరకు దరఖాస్తు చేసేందుకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం విడుదల చేసిన టెట్ నోటిఫికేషన్ షెడ్యూలు ఆధారంగా ఆగస్టు ఐదోతేదీ నుంచి 20వ తేదీ వరకు పేపర్ 1ఏ, పేపర్ 1బీ, పేపర్ 2ఏ, పేపర్ 2బీ విభాగాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఫలితాలను ఆగస్టు 30న ప్రకటిస్తారు. పరీక్షా కేంద్రాలను జిల్లాలు దాటించే విధానానికి స్వస్తి చెప్పాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్కు అభ్యర్థులు విన్నవిస్తున్నారు. సొంత జిల్లాల్లోనే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అర్హత వివరాలు పొందుపర్చాలి
ఏపీ టెట్ (జులై, 2024)కు దరఖాస్తు చేసే అభ్యర్థులందరూ. గత టెట్లో అర్హత సాధించి ఉంటే వాటి వివరాలను తప్పనిసరిగా పొందుపరచాలని సూచిస్తున్నారు. తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రూపొందించిన వెబ్సైట్లో గత టెట్ల ఫలితాల సమాచారం ఆలస్యంగా అందుబాటులోకి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టెట్ 2011లో ప్రారంభమైంది. ఆ తర్వాత 2014 నుంచి 2022, 2024 (ఫిబ్రవరి) వరకు జరిగిన టెట్లలో వరుస వారీగా అభ్యర్థులు అర్హత సాధించారు. ప్రస్తుత టెట్ దరఖాస్తులో అభ్యర్థులు ఎన్ని సార్లు అర్హత సాధించి ఉంటే… వారి హాల్ టిక్కెట్ల నంబర్లు, టెట్ నిర్వహించిన సంవత్సరం వివరాలను నమోదు చేయమంటున్నారు. ఈ సమాచారం అభ్యర్థుల దగ్గర లేకపోవడంతో తికమకపడుతున్నారు. వారిని దృష్టిలో ఉంచుకుని పాఠశాల విద్యాశాఖ ఏపీ టెట్- (జులై) 2024 వెబ్సైట్లో పూర్వపు టెట్ మార్కులను అందుబాటులో ఉంచారు.