ప్రపంచవ్యాప్తంగా నిలిచిన సేవలు
విమానాలు రద్దు… బ్యాంకులు, మార్కెట్లపై ప్రభావం
న్యూదిల్లీ: ప్రముఖ సాఫ్ట్వేర్ మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలు ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయాయి. ఈ ప్రభావంతో అనేక మంది వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ‘మైక్రోసాఫ్ట్ ఔటేజ్’ సమస్య కారణంగా అంతర్జాతీయంగా విమానాలు, మార్కెట్లు, బ్యాంకులు, స్టాక్ ఎక్స్చేంజీ సేవలపై ప్రభావం పడిరది. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వినియోగదారులు తమ కంప్యూటర్లలో విండోస్ ‘బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్(బీఎస్ఓడీ)’ సమస్య ఎదురైందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. దీంతో విమానాశ్రయాలు, టెలివిజన్ వార్తా కేంద్రాలు, ఆర్థిక సంస్థలు సహా అనేక చోట్ల ఈ ప్రభావం కనిపించింది. దీనిపై అనేక మంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ సమస్యకు కారణం ఇటీవల విడుదలైన క్రౌడ్స్ట్రైక్ కావచ్చని తెలుస్తోంది. క్రౌడ్స్ట్రైక్ అనేది యాంటీ వైరస్. ఇది ఎండ్పాయింట్ సెక్యూరిటీ కంపెనీ. వినియోగదారులు ఈ బీఎస్ఓడీ లోపాన్ని పొందడం ప్రారంభించిన వెంటనే క్రౌడ్స్ట్రైక్ సమస్య వచ్చింది. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవలు కొన్ని గంటలపాటు నిలిచిపోయాయి. అమెరికాలో కొన్ని విమాన కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడిరది. కొన్ని నివేదికల ప్రకారం వినియోగదారులు మైక్రోసాఫ్ట్ 365ని యాక్సెస్ చేయడంలో సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ సమస్య కారణంగా కొన్ని విమానాలు రద్దయ్యాయి. చాలా మంది తమ రోజువారీ పనులు పూర్తి చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్పైస్జెట్ సహా అనేక కంపెనీలు తమ సేవలు రద్దు చేశాయి. టికెట్ల బుకింగ్ సహా అనేక కార్యకాలపాలలో అవంతరాలు ఏర్పడటంతో విమానాలు రద్దయ్యాయి. ప్రస్తుతానికి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం సూచించలేదు. అయితే క్రౌడ్స్ట్రైక్ సమస్యను పరిశోధిస్తోంది. త్వరలో ఒక ప్యాచ్ను విడుదల చేయాలని భావిస్తున్నారు.
సైబర్ దాడి కాదు… సమస్యను పరిష్కరించాం: మైక్రోసాఫ్ట్
వాషింగ్టన్: మైక్రోసాఫ్ట్ విండోస్లో తలెత్తిన సాంకేతిక సమస్యపై టెక్ దిగ్గజం స్పందించింది. సమస్య పరిష్కారం దిశగా చర్యలు చేపట్టింది. ‘బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్’కు కారణమైన క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ వెనక్కి తీసుకుంది. దీనికి డీబగ్ రూపొందించామని, సమస్య పరిష్కారమైనట్లు కంపెనీ ప్రకటించింది. కానీ, ఇంకా మైక్రోసాఫ్ట్ 365 యాప్స్, సర్వీసుల్లో సమస్య కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అటు సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్ స్ట్రైక్ సీఈఓ జార్జ్ కుర్జ్ కూడా దీనిపై స్పందించారు. ‘సింగిల్ కంటెంట్ అప్డేట్లో బగ్తో తలెత్తిన వినియోగదారులతో మా కంపెనీ సంప్రదింపులు జరుపుతోంది. మ్యాక్, లైనక్స్ సిస్టమ్లపై ఎలాంటి ప్రభావం పడలేదు. అయితే, ఇది భద్రతాపరమైన వైఫల్యమో, సైబర్ దాడో కాదు. సమస్యను గుర్తించి డీబగ్ ఫిక్స్ చేశాం. క్రౌడ్ స్ట్రైక్ కస్టమర్ల భద్రతకు మేం పూర్తి ప్రాధాన్యమిస్తాం’ అని ఎక్స్ వేదికగా వెల్లడిరచారు.
మైక్రోసాఫ్ట్తో చర్చిస్తున్నాం: కేంద్ర మంత్రి
న్యూదిల్లీ: మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్య తలెత్తడంపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ స్పందించారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మైక్రోసాఫ్ట్తో నిరంతరం సంప్రదింపులు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సాంకేతిక సమస్యకు కారణాలు గుర్తించినట్లు ఆయన ఎక్స్లో వెల్లడిరచారు. వీటి పరిష్కారానికి అప్డేట్లు విడుదలయ్యాయని ప్రకటించారు. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ నెట్వర్క్ ఎలాంటి ప్రభావానికి గురికాలేదని మంత్రి పేర్కొన్నారు. ఈ సమస్యకు సంబంధించి కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సాంకేతిక సలహాలు జారీ చేస్తుందని వెల్లడిరచారు. మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది యూజర్లకు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ దర్శనమిస్తోంది. భారత్ సహా అమెరికా, ఆస్ట్రేలియాలోనూ ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది.
చేతిరాతతో బోర్డింగ్ పాస్లు
మైక్రోసాఫ్ట్ విండోస్లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా భారత్లోని విమానయాన సంస్థలు తమ సేవలను మాన్యువల్గా నిర్వహిస్తున్నాయి. ఇండిగో, విస్తారా, స్పైస్జెట్, ఆకాశ ఎయిర్ తదితర విమానయాన సంస్థలు భారత్లో తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. దీంతో ప్రయాణికులను మాన్యువల్గా చెక్ చేసి చేతి రాతతో కూడిన బోర్డింగ్ పాస్లు ఇస్తున్నారు. కొంతమంది ప్రయాణికులు ఇందుకు సంబంధించిన ఫొటోలు పంచుకుంటున్నారు. ‘నేషన్హెచ్క్యూ’ సహ వ్యవస్థాపకుడు అక్షయ్ కొఠారీ చేతి రాతతో కూడిన బోర్డింగ్ పాస్ను ప్రయాణానికి ముందు ఎక్స్లో షేర్ చేశారు. తమ ఆన్లైన్ సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని, వాటిని వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నామని విమానయాన సంస్థలు ప్రయాణికులకు ప్రకటనల ద్వారా తెలియజేస్తున్నాయి.