. ప్రధానికి సీపీఐ సవాల్
. కేజ్రీవాల్ అరెస్టుకు ఖండన
. విపక్షాలను బలహీనపర్చే కుట్ర
. బీజేపీకి ప్రజలే బుద్ధి చెబుతారు: డి.రాజా
పాట్నా: రాజకీయంగా ప్రత్యర్థుల్ని ఎదుర్కొనే దమ్ముందా అంటూ ప్రధాని మోదీకి సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా సవాల్ విసిరారు. అధిక ధరలు, నిరుద్యోగం, పేదరికం వంటి సమస్యలు వెంటాడుతుండటంతో ప్రజాగ్రహం, అసమ్మతి అంటే మోదీకి భయం పట్టుకున్నదని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీలను భయపెట్టేందుకు, బలహీనపర్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఇదే క్రమంలో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు జరిందని, దీనిని సీపీఐ తీవ్రంగా ఖండిస్తోందని రాజా తెలిపారు. ఆయన శుక్రవారం పీటీఐతో మాట్లాడుతూ మోదీపై, బీజేపీపై విమర్శలు గుప్పించారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చాక ఒక ముఖ్యమంత్రిని అరెస్టు చేయించడం వెనుక విపక్షాన్ని బెదిరించే, బలహీనపర్చే కుట్ర ఉన్నదని వ్యాఖ్యానించారు. ఇలాంటి పార్టీకి రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగు గుణపాఠం చెబుతారన్నారు. కేజ్రీవాల్ అరెస్టుకు గురయ్యారు… మరి ఆ పార్టీ తరపు ఆయన ప్రచారం ఎలా చేయగలరు? ఇదంతా మోదీ ప్రభుత్వ కుట్ర. విపక్షాన్ని బలహీనపర్చి పబ్బం గడుపుకునే యత్నం అని రాజా దుయ్యబట్టారు. పేదరికం, నిరుద్యోగం, అధిక ధరలు వంటి సమస్యలపై ప్రజాగ్రహం భయంతోనే ప్రతిపక్షాన్ని బెదిరించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు ముఖ్యంగా ఈడీని మోదీ ప్రభుత్వం వినియోగిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంకు ఖాతాల స్తంభనను రాజా ప్రస్తావించారు. ఇది ఆర్థిక ఉగ్రవాదమని… రాజకీయ ప్రత్యర్థులలో భయాన్ని నింపడం తప్ప మరో ఉద్దేశం లేదన్నారు. నిరంకుశ ప్రభుత్వానికి ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెబుతారన్నారు. దక్షిణ రాష్ట్రాల్లోకి బీజేపీని చొప్పించేందుకు ప్రధాని యత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. కర్నాటకలో ఒకప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు కనుమరుగు అయ్యింది. తెలంగాణలోనూ చతికిల పడిరది. తమిళనాడు సామాజిక సంస్కరణలకు, పోరాటాల రాష్ట్రం. ఇక్కడ బీజేపీ హిందూత్వ రాజకీయాలకు స్థానంలేదు’ అని రాజా నొక్కిచెప్పారు.