బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 అంత్యక్రియలకు అన్ని ఏర్పాటు పూర్తయ్యాయి. సోమవారం జరగనున్న రాణి అంతిమయాత్ర కోసం అక్కడి ప్రభుత్వం కనీవిని ఎరుగని స్థాయిలో ఏర్పాట్లు చేసింది. 1965లో చివరిసారిగా వినిస్టంట్ చర్చిల్కు అధికారికంగా ప్రభుత్వం ఈ స్థాయిలో అంత్యక్రియలు నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది ప్రముఖులు, లక్షల మంది బ్రిటన్ పౌరులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. క్వీన్ ఎలిజబెత్ అంతిమయాత్రకు 10 లక్షలకు పైగా పౌరులు లండన్ చేరుకుంటారని అంచనా. వీరిని నియంత్రించేందుకు లండన్లో 36 కిలోమీటర్ల మేర బ్యారికేడ్లు నిర్మించారు. సోమవారం ఉదయం 11 గంటలకు వెస్ట్మినిస్టర్ హాల్ నుంచి వెస్ట్మినిస్టర్ అబే వరకూ రాణి శవపేటిక ఊరేగింపు ప్రారంభం కానుంది. ఇది గంటలో పూర్తవుతుంది. అక్కడ నుంచి వెల్లింగ్టన్ అర్చి వరకూ సాగే అంతిమయాత్ర 12.15 గంటలకు మొదలవుతుంది. అనంతరం విండ్సర్స్ క్యాజిల్లోని సెయింట్ జార్జ్ చాపెల్కు రాణి పార్ధీవదేహాన్ని అంతిమయాత్రగా తీసుకెళ్తారు. ఈ కార్యక్రమంలో రాజ కుటుంబం కూడా పాల్గొంటుంది. కింగ్ జార్జ్ 6 మెమోరియల్ చాపెల్లోకి తీసుకెళ్లిన తర్వాత చివరగా రాయల్ వాల్ట్లో క్వీన్ ఎలిజబెత్ భర్త ప్రిన్స్ ఫిలిప్ను ఉంచిన దగ్గరే ఆమె శవపేటికను ఉంచుతారు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత రెండు నిమిషాల పాటు అందరూ మౌనం పాటించనున్నారు.