. వరదల సమయంలో డ్రోన్ల వినియోగం సరికొత్త విప్లవం
. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : వచ్చే ఇరవై సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా అన్ని ముఖ్య పట్టణాల్లో దాదాపు 200 విమానాశ్రయాలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. దేశాభివృద్ధి కోసం నిరంతరం ఆలోచించే వ్యక్తి ప్రధాని మోదీ అని, అనేక విప్లవాత్మక సంస్కరణలతో రాష్ట్రాభివృద్ధికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు ఉపయోగపడుతుందన్నారు. మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం నిర్వహించిన అమరావతి డ్రోన్ సమ్మిట్-2024 లో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ పదేళ్ల క్రితం 74గా ఉన్న విమానాశ్రయాల సంఖ్య 150కి పెరిగిందన్నారు. రాబోయే 20 ఏళ్లలో 200కు పైగా విమాశ్రయాలు వస్తాయన్నారు. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా విమానాశ్రయాలు, విమానాలు మరిన్ని పెంచుతామన్నారు. డ్రోన్ నిబంధనలను కేంద్రం సులభతరం చేసిందని, డ్రోన్ స్టార్టప్లలో యువతను కేంద్రం ప్రోత్సహిస్తోందన్నారు. ప్రపంచ డ్రోన్ హబ్గా ఏపీ ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడ వరదల సమయంలో డ్రోన్ల వినియోగంతో అత్యవసర సేవలు అందించడం సరికొత్త విప్లవమని తెలిపారు. రాష్ట్రంలో ఎయిర్ కనెక్టివిటీని పెంచిన ఘనత కూడా చంద్రబాబుకే దక్కుతుందని, దేశవ్యాప్తంగా అందరూ నేడు అమరావతి వైపే చూస్తున్నారన్నారు. దిల్లీ తర్వాత మరలా అమరావతిలోనే డ్రోన్ సమ్మిట్-2024 నిర్వహించడం జరుగుతోందన్నారు. డ్రోన్లో వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండిరగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానం వచ్చిందని, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏపీకి తేవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారని తెలిపారు.
అందుకే డ్రోన్ టెక్నాలజీ నిపుణులు ముందుకు రావాలని, ఇక్కడ నిర్మాణాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. డ్రోన్ దీదీ ప్రోగ్రాం ద్వారా దేశంలో మహిళలకు ఉపాధి కూడా కలుగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ ఇప్పుడు అందరితో మాట్లాడి పాలసీ రూపొందిస్తోందని, అందువల్ల తప్పకుండా ఇదే ఉత్తమ పాలసీ అవుతుందని రామ్మోహన్ నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.