ముంబైలో ఆరుగంటల్లో 30 సెం.మీ. వర్షపాతం
. విమాన, స్థానిక రైలు సర్వీసులకు అంతరాయం
. నీట మునిగిన వాహనాలు
. స్తంభించిన జనజీవనం
. అసోం, హిమాచల్, బీహార్, మహారాష్ట్రలో భారీవర్షాలు
. ఉప్పొంగుతున్న నదులు
ముంబై : దేశంలోని వివిధ రాష్ట్రాలు వరదలతో అతలాకుతలమవుతున్నాయి. ప్రధాన నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఆరు గంటల పాటు కుంభవృష్టి కురవగా రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. దీంతో నగరంలో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు, రోడ్లు, రైల్వే మార్గాలు జలమయమయ్యాయి. ఫలితంగా లోకల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిరది. భారీ వర్షాల దృష్ట్యా విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు ముంబై వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. దీంతో 300 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడిరచారు. అత్యధికంగా గోవండి ప్రాంతంలో 315 మి.మీ., పోవాయ్లో 314 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు తెలిపారు. వర్షం కారణంగా సెంట్రల్ రైల్వే సబర్బన్ సర్వీసులకు అంతరాయం ఏర్పడిరది. పట్టాలు మునిగిపోవడం తో చాలా లోకల్ రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. భారీ వర్షాల దృష్ట్యా ఆర్టీసీ బస్సులను కూడా అధికారులు నిలిపివేశారు. వర్షం కారణంగా ముంబైలోని అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అంధేరి, కుర్లా, భందూప్, కింగ్స్ సర్కిల్, దాదర్తోపాటు అనేక ప్రాంతాలు నీట మునిగినట్లు అధికారులు తెలిపారు. రహదారులపై మోకాలి లోతు నీరు రావడం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో కార్లు, మోటారు సైకిళ్లునీళ్లలో మునిగిపోయాయి. అటు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు మున్సిపల్ కార్పొరేషన్ సెలవు ప్రకటించింది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. నగరంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ముంబైతో పాటు థానే, పాల్ఘర్, కొంకణ్ బెల్ట్కు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దక్షిణ ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (సీఎస్ఎంటీ), పొరుగున ఉన్న థానే మధ్య ప్రధాన కారిడార్ ఫాస్ట్ లైన్లో వివిధ ప్రదేశాలలో నీటి ప్రవాహం కారణంగా రైలు సేవలను నిలిపివేసినట్లు సెంట్రల్ రైల్వే (సీఆర్) చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ స్వప్నిల్ నిల తెలిపారు. సబర్బన్ సర్వీసులు స్లో లైన్లో నడుస్తున్నాయని చెప్పారు. మెయిన్ ,హార్బర్ కారిడార్లలో ట్రాక్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో సెంట్రల్ రైల్వే సబర్బన్ సర్వీసులు తీవ్రంగా దెబ్బతిన్నాయని అధికారులు తెలి పారు. కాగా సబర్బన్ సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నా యని ప్రయాణికులు వాపోతున్నారు. అయితే అనివార్యమైతే తప్ప ప్రజలు ప్రయాణానికి దూరంగా ఉండాలని సీఆర్ అధికారులు కోరారు. భారీ వర్షాలతోపాటు, వాతావరణం అనుకూలించకపోవడంతో ముంబై విమానాశ్రయంలో విమానసర్వీసులు నిలిచి పోయాయి. సోమవారం తెల్లవారుజామున 2.22 నుండి 3.40 గంటల వరకు రన్వే కార్యకలాపాలు నిలిపివేశారు. 27 విమానాలను దారి మళ్లించారు. అలాగే 50 విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు. అహ్మదాబాద్, హైదరాబాద్, ఇండోర్ తదితర నగరాలకు విమానాలను మళ్లించినట్లు అధికారులు తెలిపారు.
అసోంను వీడని వరద…వన్య ప్రాణుల మృత్యువాత
అసోంను గత కొన్నిరోజులుగా వరదలు ముంచెత్తుతున్నాయి. వివిధ జిల్లాల్లో ఆరున్నర లక్షల మంది వరదలకు ప్రభావితమయ్యారు. ఇప్పటికీ బ్రహ్మపుత్ర దాని ఉప నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. తాజాగా కమ్రూప్ జిల్లాలో కొండ చరియలు విరిగిపడడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వరదలు, కొండచరియలు విరిగిపడడం, తుపానుల కారణంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 64కి చేరింది. కాగా వరదల వల్ల కజిరంగ నేషనల్ పార్క్లోని 129 వన్యప్రాణులు మృత్యువాత పడినట్లుగా అధికారులు వెల్లడిరచారు. ఇప్పటివరకు 6 ఖడ్గమృగాలు, 100 హాగ్ జింకలు, రెండు సాంబార్, ఒక ఒట్టర్ సహా 114 వన్యప్రాణులు ప్రాణాలు కోల్పోయాయి. మరికొన్ని హాగ్ జింకలు, ఖడ్గమృగాలు సహా 96 వన్యప్రాణులను రక్షించారు. కాగా 2017 సంవత్సరంలో సంభవించిన భారీ వరదలకు ఈ పార్క్లోని 350 వన్యప్రాణులు మృత్యువాత పడ్డాయి. కజిరంగా నేషనల్ పార్క్లోకి భారీగా చేరిన వరద నీటిలో ఖడ్గమృగం ఇబ్బందిపడుతున్న వీడియోను రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ‘ఎక్స్’వేదికగా పంచుకున్నారు. రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న వరదలు మానవులకు, వన్యప్రాణులకు ప్రమాదకరంగా మారాయని, ప్రజల సంరక్షణార్థం రాష్ట్రంలోని సహాయక బృందాల బృందం 24 గంటలు శ్రమిస్తున్నాయని శర్మ తన పోస్ట్లో పేర్కొన్నారు.
రాష్ట్రంలోని గోల్పరా, నాగావ్, నల్బరీ, కమ్రూప్, మోరిగావ్, దిబ్రూఘఢ్, సోనిత్పూర్, లఖింపూర్, సౌత్ సల్మారా, ధుబ్రి, జోర్హాట్, చారైడియో, హోజై, కరీంనగర్, శివసాగర్, బొంగైగావ్, బార్పేట, ధేమాజీ, హైలాకండి, గోలాఘాట్, దర్రాంగ్, బిస్వనాథ్, కాచర్, కమ్రూప్, టిన్సుకియా, కర్బీ అంగ్లాంగ్, చిరాంగ్, కర్బీ అంగ్లాంగ్ వెస్ట్, మజులి జిల్లాలు వరదల కారణంగా తీవ్ర ప్రభావితమయ్యాయి. ముంపు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది వరదలు, కొండచరియలు వంటి ఘటనల కారణంగా మరణించిన వారి సంఖ్య 64కి పెరిగింది. 24 లక్షలమంది వరదలకు ప్రభావితమయ్యారు