. జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై అభ్యర్థనకు సుప్రీం తిరస్కృతి
. అక్రమాస్తుల కేసు తదుపరి విచారణ ఏప్రిల్కు వాయిదా
. రామానాయుడు భూముల అమ్మకంపై స్టే
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సుప్రీం కోర్టులో శుక్రవారం వరుసగా రెండు కేసుల్లో చుక్కెదురైంది. అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ బెయిల్ రద్దు సహా ఇతరులపై నమోదయిన కేసుల విచారణను తెలుగు రాష్ట్రాల నుంచి బదిలీ చేయాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు వేసిన వేర్వేరు పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ ఎందుకు ఆలస్యమవుతోందని న్యాయస్థానం ప్రశ్నించింది. ఇందుకు తాము బాధ్యులం కాదని సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పగా… ఎవరు బాధ్యత వహిస్తారని న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. దిగువ కోర్టులో వాయిదాలతో తమకు సంబంధం లేదని తుషార్ మెహతా పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థకు సంబంధం లేకపోతే ఎవరికి ఉంటుందని జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులపై దాఖలయిన పిటిషన్లను వేగంగా విచారించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఈ సందర్భంగా జగన్ తరపు న్యాయవాదులు ప్రస్తావించారు. అందుకని విచారణ ముగించాలని కోరారు. హైకోర్టు సుమోటోగా ఆదేశాలు ఇచ్చినందున 3 నెలల గడువు ఇవ్వాలని, ఆ తర్వాత పరిశీలన జరపాలని వాదించారు. తాము ఈ పిటిషన్లపై విచారణ ముగించడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. సమయమిచ్చి ఉపయోగం ఏమిటని, ఫలితం ఎక్కడా కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. ఇన్నిసార్లు వాయిదాలు పడటం, ఇంత కాలయాపన ఏమిటంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రాజకీయ దృక్పథంతో పిటిషనర్ ఇక్కడ పిటిషన్ దాఖలు చేశారని జగన్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆయనపై చర్యలు తీసుకోవడంతో మూడేళ్లుగా పార్టీ కార్యకలాపాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. రఘురామపై అనర్హత పిటిషన్ దాఖలు చేసినందునే ఇక్కడ సీఎం జగన్కు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు చేశారన్నారు. దీనిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పందిస్తూ తాము రాజకీయ వ్యవహారాలను పరిశీలించడం లేదని, కేవలం న్యాయపరమైన అంశాలనే పరిశీలిస్తున్నట్లు తెలిపారు. విచారణ ఆలస్యం ఎందుకు అవుతుందనేది ఇక్కడ ప్రధానాంశమని, ఇంతకాలం నుంచి ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ అయినా పరిష్కరించారా? అని ప్రశ్నించారు. తెలంగాణ హైకోర్టు గత ఏడాది డిసెంబరు 15న పలుకుబడి ఉన్న వ్యక్తులు కేసులను త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చినందున, ఏం జరుగుతుందో చూద్దామని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను ఏప్రిల్లో చేపట్టనున్నట్లు తెలిపింది.
రామానాయుడు భూముల వ్యవహారంలో సర్కారుకు ఎదురు దెబ్బ
విశాఖపట్నంలోని రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారంలోనూ సుప్రీంలో జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ భూములను లేఅవుట్ చేసి అమ్మకాలు చేపట్టడంపై స్టే విధిస్తూ, ఏపీ ప్రభుత్వం, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. 2003 సెప్టెంబరు 13న ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న అవసరాలకు మినహా ఎలాంటి కార్యకలాపాలకు ఆ భూములు ఉపయోగించకూడదని ఆదేశించింది. సినీ అవసరాలకు వినియోగించేందుకు 35 ఎకరాల భూమిని 2003లో అప్పటి ప్రభుత్వం కేటాయించింది. కోస్టల్ నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్ చేసి ఇతర కార్యకలాపాలకు వినియోగించేందుకు వైసీపీ ప్రభుత్వం అనుమతించింది. ఆ ఆదేశాలను సవాలు చేస్తూ విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, కేసు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్పై జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. భూమిని ఎందుకు కేటాయించారు? ప్రస్తుతం లేఅవుట్ వేశారా? కార్యకలాపాలు చేపట్టారా? అని పిటిషనర్ తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. సినీ స్టూడియో నిర్మాణానికి భూములు కేటాయించారని, అందుకు అనుగుణంగా అక్కడ ఎలాంటి పనులు చేపట్టకుండా లేఅవుట్ వేసి అమ్మకాలకు సిద్ధం చేశారని ధర్మాసనం దృష్టికి ఆయన తీసుకువచ్చారు. దీంతో స్టే విధించిన సుప్రీం కోర్టు, రాష్ట్ర ప్రభుత్వం, ప్రతివాదులకు నోటీసులు ఇస్తూ మార్చి 11 లోపు స్పందించాలని ఆదేశించింది.