. విద్యార్థి నాయకులపై పోలీస్ జులుం
. విజయవాడలో అక్రమ అరెస్టులు…విద్యార్థి సంఘాల నిరసన
. ‘నీట్’ రద్దు చేయాలని కదం తొక్కిన విద్యార్థులు
విశాలాంధ్ర` – విజయవాడ/గుంటూరు: వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశానికి జాతీయస్థాయిలో నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకవడంతో పాటు అనేక అక్రమాలు జరిగిన నేపథ్యంలో నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ, పీడీఎస్యూ, ఏఐఎస్ఏ, ఎన్ఎస్యూఐ, పీడీఎస్ఓ తదితర విద్యార్థి సంఘాల పిలుపు మేరకు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు బంద్లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. కాగా విజయవాడలో విద్యార్థి నాయకుల అరెస్టు ఉద్రిక్తతకు దారి తీసింది. శాంతియుతంగా నిర్వహిస్తున్న బంద్లో పాల్గొన్న విద్యార్థి సంఘాల నాయకులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మొగల్రాజపురం సిద్దార్థ కళాశాల వద్ద నిరసన కార్యక్రమంలో ప్రసంగించకుండా విద్యార్థి నాయకులను అడ్డుకున్నారు. ఈడ్చుకెళ్లి వ్యాన్లో ఎక్కించి మాచవరం పోలీస్ స్టేషన్కు తరిలించారు. వీరిపై అక్రమంగా 170 బీఎన్ఎస్ అనే కొత్త చట్టం కింద కేసులు నమోదు చేశారు. నీట్, నెట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని, అసమర్థ ఎన్టీఏను రద్దు చేయాలని, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఎల్ కేజీ నుంచి పీజీ వరకు విద్యాసంస్థల బంద్కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన సంగతి విదితమే. విజయవాడలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వి.జాన్సన్ బాబు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఏ.అశోక్ మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నీట్, నెట్ పేపర్ లీకేజీలో లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయారని తెలిపారు. ఐదేళ్లుగా దేశవ్యాప్తంగా 65 పేపర్ లీకేజి ఘటనలు జరిగినా పరీక్షలు నిర్వహించే ఎన్టీఏ పై చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతోందని మండిపడ్డారు. క్యూట్, నీట్ వంటి కేంద్రీకృత పరీక్షలు విద్యను ప్రైవేటీకరించడాన్ని, కోచింగ్ సెంటర్ల సంస్కృతిని పెంపొందించడాన్ని ప్రోత్సహిస్తున్నాయని ధ్వజమెత్తారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పేద విద్యార్థులకు విద్య అందుబాటులో లేకుండా, భరించలేనిదిగా చేసిందన్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది విద్యార్థులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. ‘వన్ నేషన్` వన్ ఎగ్జామ్’ అనే ముసుగులో మొత్తం పరీక్షా వ్యవస్థను నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎన్టీఏను రద్దు చేసి రాష్ట్రాల పరిధిలో నీట్, నెట్ పాత పద్ధతిలో నిర్వహించాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని లేని పక్షంలో భవిష్యత్తులో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. విద్యార్థి సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ప్రతి ఒక్కరూ ఖండిరచాలని కోరారు. పీడీఎస్యూ జాతీయ నాయకులు ఎం.రామకృష్ణ, పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శులు రాజశేఖర్, భాస్కర్ మాట్లాడుతూ… నెట్, నీట్ పేపర్ లీకేజీలు జరిగాయని… బీహార్ రాష్ట్రంలో 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. ఈ లీకేజీల్లో కోట్లాది రూపాయల కుంభకోణం జరిగిందని తెలిసినా కేంద్ర విద్యా శాఖ వారిపై చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. తక్షణమే కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను బాధ్యతల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహె చ్. వెంకటేశ్వరరావు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఎం.సాయి కుమార్, పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు భూషణ్, ఐసా జిల్లా కార్యదర్శి మహేష్,శివ నాయక్, ఎస్ఎఫ్ఐ విజయవాడ నగర కార్యదర్శి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
గుంటూరులో…
గుంటూరులో విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. గుంటూరులోని హిందూ కళాశాల, ప్రభుత్వ మహిళా కళాశాల, ఏసీ కళాశాలల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి మీడియాతో మాట్లాడుతూ… జాతీయ స్థాయి పరీక్షలను నిర్వహించడంలో ఎన్టీఏ విఫలమవడంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిరదన్నారు. దీనిపై నోరు మెదపలేని స్థితిలో కేంద్రం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ పరీక్ష నిర్వహించే ఎన్టీఏను రద్దు చేయాలని బాధిత విద్యార్థులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు మొరపెట్టుకున్నా కూడా స్పందించకపోవడం దారుణమన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎన్టీఏను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పారే కానీ బాధిత విద్యార్థులకు న్యాయం చేస్తామని గానీ నీట్ పరీక్షను మళ్లీ నిర్వహిస్తామని గానీ చెప్పకపోవడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బందెల నాసర్ జీ, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు షేక్ సమీర్, జిల్లా గర్ల్స్ కన్వీనర్ బీ సుచరిత, ఎన్ఎస్యూఐ జిల్లా ఉపాధ్యక్షులు తిరుమలరావు, ఏఐఎస్ఎఫ్ నగర కార్యదర్శి యశ్వంత్, నాయకులు అమర్నాథ్, అజయ్, గణేష్, కిరణ్, ఎస్ఎఫ్ఐ నాయకులు యశ్వంత్ ఆరిఫా, భగత్ సింగ్, నగర్ నాయకులు షంషీర్, ఆరిఫ్, రోహిత్, హర్ష, ఎన్ఎస్యూఐ నాయకులు సుమన్, కోటేశ్బాబు, మదన్, పీడీఎస్యూ నాయకులు ప్రసన్న, మానస, చరిత తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు జిల్లాలో…
కర్నూలు జిల్లాలో విద్యాసంస్ధల బంద్ విజయవంతమైంది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. ముఖ్యంగా జిల్లాలోని ఆదోని, ఆలూరు, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సోమన్న, షాబీర్బాష, పీడీఎస్యూ రాష్ట్రకార్యదర్శి భాస్కర్, ఐసా రాష్ట్ర నాయకులు నాగరాజు, ఐసా, ఎస్ఎఫ్ఐ తదితర విద్యార్థిసంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.