. ‘భారత్ జోడో’ను అడ్డుకునేందుకు కుట్ర
. మోదీ దేవుడికే పాఠాలు చెప్పగలడు
. ధరల పెరుగుదల, నిరుద్యోగమే అసలు సమస్యలు
. అమెరికాలో రాహుల్ గాంధీ
శాన్ఫ్రాన్సిస్కో : ఐక్యతా సందేశంతో తాను భారతదేశంలో జరిపిన భారత్ జోడో యాత్రను అడ్డుకునేందుకు మోదీ సర్కార్ తీవ్రంగా ప్రయత్నించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. భారత్లో ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా పోరాడితే బీజేపీని గద్దె దించడం కష్టం కాదన్నారు. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. దేశంలో ముస్లింలు, ఆదివాసీలకు రక్షణ కరువైందని విమర్శించారు. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో భారత సంతతి ప్రజలు ఏర్పాటు చేసిన ‘మొహబ్బత్ కి దుకాన్’ కార్యక్రమంలో రాహుల్ బుధవారం ప్రసంగించారు. భారత్ జోడో యాత్ర గతేడాది సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమై 12 రాష్ట్రాల మీదుగా సాగి జనవరిలో జమ్ముకశ్మీర్ చేరుకోవడంతో పూర్తయిందని ఆయన చెప్పారు. పరస్పర ఆప్యాయత, గౌరవం, నమ్రత వంటి స్ఫూర్తి సందేశాన్ని భారత్ జోడో యాత్రతో చాటామని రాహుల్ తెలిపారు. రాజకీయాల్లో ఉపయోగించే ఎలాంటి పద్ధతులు కూడా ప్రజలను ఏకతాటిపైకి తెచ్చేందుకు పనిచేయవనే విషయం యాత్రకు ముందే తాను గ్రహించానన్నారు. చరిత్రను పరిశీలిస్తే ఆధ్యాత్మికవేత్తలైన గురునానక్ దేవ్, గురు బసవన్న, నారాయణ గురు వంటి వారు ఇదే మార్గాన్ని ఎంచుకుని దేశాన్ని ఐక్యంగా ఉంచారని గుర్తు చేశారు. అధికార బీజేపీ ప్రజలను భయపెడుతూ, ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. అన్నీ తనకే తెలుసునని ప్రధాని మోదీ అనుకుంటారని రాహుల్ వ్యాఖ్యానించారు. ఆ వ్యక్తులు దేవుడి పక్కన కూర్చుని, దేవుడికే అన్ని విషయాలూ వివరించి చెప్పగలరన్నారు. మోదీని దేవుడి పక్కన కూర్చోబెడితే, ఈ విశ్వం ఎలా పని చేస్తోందో దేవుడికే మోదీ వివరిస్తారని, అప్పుడు దేవుడు కంగారుపడతాడని, తాను ఏమి సృష్టించానోనన్న అనుమానం దేవుడికే వస్తోందన్నారు. ఇవి సరదా విషయాలైనప్పటికీ ఇదే జరుగుతుందన్నారు. అన్ని విషయాలను అర్థం చేసుకునే ఓ బృందం ఉందని, వారు సైంటిస్టులకు సైన్స్ను వివరించి చెప్పగలరన్నారు. చరిత్రకారులకు చరిత్రను, సైన్యానికి యుద్ధాన్ని వివరించి చెప్పగలరని, కానీ వారిది మిడి మిడి జ్ఞానమని, వారికి ఏదీ అర్థం కాదని చెప్పారు. భారత దేశం ఏ సిద్ధాంతాన్నీ తిరస్కరించలేదన్నారు. అటువంటి భారత దేశానికి మీరు (ఎన్ఆర్ఐలు) ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నారు. అమెరికాలో భారత దేశ జాతీయ జెండాను పట్టుకున్న ప్రవాస భారతీయులందరికీ ధన్యవాదాలు చెప్పారు. మీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పమని తనను అడిగారని, ఇది బీజేపీలో జరగదని, బీజేపీలో ప్రశ్నలుండవు, కేవలం జవాబులు మాత్రమే ఉంటాయన్నారు. మోదీ, ఆయన ప్రభుత్వం నిరుద్యోగం, ధరల పెరుగుదల, ఆగ్రహం, విద్వేషం వంటి సమస్యలను పరిష్కరించలేకపోతున్నారని, వీటిపై వారు చర్చించరని, అందుకే ధర్మదండం, రాజదండం వంటి కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శించారు.