. వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పూనం, రేవు, గుప్తా
. పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం
. ఇదే బాటలో మరికొందరు ఐఏఎస్, ఐపీఎస్లు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి నాలుగోసారి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధమవుతున్నందున అధికార యంత్రాంగంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఉన్నతాధికారులపై చర్యలు ప్రారంభమయ్యాయి. తొలుత సీఎంవో నుంచే ప్రక్షాళన ప్రారంభించారు. ఇందులో భాగంగా ఇప్పటికే సీఎస్ జవహర్ రెడ్డిని తప్పుకోవాలని సంకేతాలు ఇచ్చిన చంద్రబాబు, తదుపరి ఆదేశాలు ఇచ్చేలోపే ఆయనే సెలవుపై వెళ్లిపోయారు. అనంతరం ఆయన స్థానంలో మరో సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు చేపట్టగా, ఇది జరిగిన కొద్దిగంటల్లోనే సీఎంఓలో మిగిలిన ముగ్గురు కీలక ఐఏఎస్ అధికారులపై బదిలీ వేటు వేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ముగ్గురికీ ఎక్కడా పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఎంవోలో కీలకంగా వ్యవహరించిన పూనం మాలకొండయ్య, రేవు ముత్యాలరాజు, నారాయణ భరత్ గుప్తాను బదిలీ చేస్తూ జీఏడీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు వారికి ఎక్కడా పోస్టింగ్ కూడా ఇవ్వకుండా జీఏడీకి రిపోర్ట్ చేయాలని మాత్రమే ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో జగన్ ప్రభుత్వంలో వైసీపీ విధేయులుగా ముద్రపడిన అధికారులపై బదిలీ వేటు పడుతున్నట్లు అర్థమవుతోంది. ఇప్పటికే సీఎంవోలో కీలకంగా వ్యవహరించిన ధనుంజయ్ రెడ్డి మే 31వ తేదీ పదవీ విరమణ చేసి వెళ్లిపోగా, తాజాగా ముగ్గురు బదిలీ అయ్యారు. అలాగే ఐపీఎస్ల్లో వైసీపీ ప్రభుత్వ విధేయులుగా ముద్రపడిన అధికారులపై చర్యలకు కూడా జాబితా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాబోయే సీఎం చంద్రబాబుని కలవడానికి ప్రయత్నించిన సీఐడీ మాజీ చీఫ్ సంజయ్, ఇంటిలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, సిట్ అధిపతి కొల్లి రఘురామిరెడ్డికి అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. వీరితో పాటు టీడీపీ శ్రేణులపై అక్రమ కేసుల బనాయింపులో మరికొందరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు పడనున్నట్లు, ఐఏఎస్, ఐపీఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైసీపీకి వీర విధేయులుగా వ్యవహరించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇప్పటికే కొందరు కేంద్ర ప్రభుత్వ సర్వీసులోకి వెళ్లేందుకు ప్రయత్నించగా ఎవరినీ రిలీవ్ చేయవద్దని చంద్రబాబు నుంచి జీఏడీకి ఆదేశాలు అందాయి. దీంతో ఎప్పుడు, ఎవరిపై చర్యలు ఎలా ఉంటాయోనని ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి.
ఏపీ బేవరేజెస్ ఎండీ నివాసంలో సీఐడీ సోదాలు
మరోపక్క ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్లోని నానక్రామ్గూడకు మూడు కార్లలో వెళ్లిన సీఐడీ పోలీసులు ఉదయం నుంచి ఆయన నివాసంలోని వివిధ పత్రాలను తనిఖీ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం దోపిడీ పర్వాన్ని వాసుదేవరెడ్డి ముందుండి నడిపించారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. నూతన మద్యం విధానం పేరుతో ఆ పార్టీకి అనుచిత లబ్ధి చేకూరేలా భారీ ఎత్తున మద్యం సరఫరా చేశారని అప్పల్లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కొత్త బ్రాండ్లు తీసుకురావడంలో వాసుదేవరెడ్డి కీలక పాత్ర పోషించారు. అలాగే మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహించడం, ఆ దుకాణాల్లో డిజిటల్ నగదు చెల్లింపులకు అవకాశం లేకుండా చేయడంలో ఆయనదే కీలకపాత్రగా టీడీపీ శ్రేణులు ఆరోపించాయి. వైసీపీ ప్రభుత్వానికి మద్యం విక్రయాలు అతిపెద్ద ఆదాయ వనరుగా మార్చడంలో, ఈ శాఖలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు లేకుండా వైసీపీ నేతలు అక్రమ ఆర్జనకు పాల్పడడంలో వాసుదేవరెడ్డి పాత్ర కీలకంగా టీడీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఐడీ ఆయన నివాసంలో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.