జెరూసలేం: ఇజ్రాయిలీ బ్లాక్ పాంథర్స్ వ్యవస్థాపకుడు, హదాష్ ఎంపీగా సుదీర్ఘ కాలం పనిచేసిన చార్లీ బిటాన్ (76) కన్నుమూశారు. 2021లో మెడకు శస్త్రచికిత్స తర్వాత నరం చిట్లిపోవడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణించింది. ఈనెల 24వ తేదీన చార్లీ బిటాన్ తుది శ్వాస విడిచారు. గివట్ షౌల్ స్మశానవాటికలో అంత్యక్రియలు ముగిశాయి. బిటాన్కు భార్య, పిల్లలు, మనుమళ్లు, మనుమరాళ్లు ఉన్నారు. పలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎల్ఓ) చరిత్రాత్మక నాయకుడు యాసిర్ అరాఫత్ను కలిసిన మొట్టమొదటి ఇజ్రాయిలీ ఎంపీగా చార్లీ బిటాన్ నిలిచారు. వీరి భేటీ 1980లో జరిగింది. చార్లీ 1971లో ఇజ్రాయిలీ బ్లాక్ పాంథర్స్ను స్థాపించారు. చార్లీ బిటాన్ 1947లో మొరక్కోలోని కాసబ్లాంకాలో జన్మించారు. ఈయన కుటుంబం ఇజ్రాయిల్కు వలస వెళ్లింది. చార్లీ బిటాన్ 1977 నుంచి 1990 వరకు హర్దాష్తో కలిసి క్నెసెట్లో సేవలు అందించారు. ఆ తర్వాత రెండేళ్లు బ్లాక్ పాంథర్ వర్గం కోసం పనిచేశారు. 1980 సెప్టెంబరులో పీఎల్ఓ నేతలను బహిరంగంగా కలిసిన నాయకుల్లో బిటాన్, తౌఫీక్ తౌబీ ఉన్నారు. ఇదే సందర్భంగా వారు అరాఫత్ను కలిశారు. ఈ సమావేశం బల్గేరియాలో జరిగింది. 1987లో చార్లీ బిటాన్ నేతృత్వ ఇజ్రాయిలీ ప్రతినిధుల బృందం బుడాపెస్ట్కు వెళ్లి పలస్తీనా అధ్యక్షుడు ఫతా మహమూద్ అబ్బస్ను కలిసింది. క్నెసెట్ పదవిని కోల్పోయిన తర్వాత చార్లీ బిటాన్ క్రమంగా రాజకీయాలకు దూరమయ్యారు. ఇజ్రాయిలీ సామాజిక మాధ్యమాలకు మద్దతిచ్చేవారు. 2011లో ఇజ్రాయిల్లో ప్రజాగ్రహం మిన్నంటింది. అతిపెద్ద ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.