గాజా శిబిరంపై దాడికి నెతన్యాహు వివరణ
జెరూసలేం: పలస్తీనాపై ఇజ్రాయిల్ భీకర దాడులు కొనసాగిస్తోంది. తాజాగా రఫాలోని శిబిరంపై చేసిన దాడిలో 45 మంది పలస్తీనియన్లు మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు ఇజ్రాయిల్ దాడుల్లో 36,050 మంది చనిపోగా, 81,026 మంది గాయపడినట్లు గాజా ఆరోగ్యశాఖ తెలిపింది. అయితే శిబిరంపై దాడి ఉద్దేశపూర్వకంగా జరిగినది కాదని ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. వైమానిక దాడుల క్రమంలో పొరపాటుగా అలా జరిగిపోయిందని, దీనిపై దర్యాప్తు జరిపిస్తున్నట్లు చెప్పారు. అదే సమయంలో గాజాపై పోరు ఆగబోదని నెతన్యాహు తేల్చిచెప్పారు. పౌర మరణాలను సాధ్యమైనంత మేరకు నివారించేందుకు ఐడీఎఫ్ యత్నిస్తోందన్నారు.
ఐరాస ఖండన
గాజాలోని శిబిరంపై ఇజ్రాయిల్ బాంబుల వర్షం కురిపించడాన్ని ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ‘ఎక్స్’లో ఆక్షేపించారు. భీకర దాడుల నుంచి రక్షణ కోసం శిబిరాల్లో ఆశ్రయం పొందిన అమాయకుల ప్రాణాలను కిరాతకంగా హరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. గాజాలో సురక్షిత ప్రాంతమంటూ ఏదీ లేదని ఆందోళన వ్యక్తంచేశారు. ఇది చాలా భయానకమని, దీనిని తక్షణమే ఆపేయాలని ఇజ్రాయిల్కు సూచించారు. అంతర్జాతీయ అత్యున్నత న్యాయస్థానం (ఐసీజే) సైతం గాజాలో దాడులను నిలిపివేయాలంటూ యూద దేశానికి ఆదేశాలు జారీచేసింది. మానవతా సాయానికి అనుమతించాలని సూచించింది కానీ ఇజ్రాయిల్ మాత్రం మొండిగా రక్తపాతం సృష్టిస్తూనే ఉన్నది.
పౌరులకు మెరుగైన రక్షణ కల్పించాలి: అమెరికా
శిబిరంపై ఇజ్రాయిల్ దాడిలో 45 మంది చనిపోవడం బాధాకరమని అమెరికా ప్రకటించింది. దీనిని తీవ్రంగా ఖండిరచింది. పలస్తీనా పౌరులకు మెరుగైన రక్షణ కల్పించేందుకు ఇజ్రాయిల్ తగు విధంగా చర్యలు చేపట్టాలని సూచించింది.