ఇస్లామాబాద్: భారతదేశ ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీకి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సోమవారం అభినందనలు తెలిపారు. ‘ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన మీకు అభినందనలు’ అని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో షెహబాజ్ ట్వీట్ చేశారు. చైనాలో ఐదు రోజుల పర్యటన ముగించుకున్న మరుసటి రోజే షెహబాజ్ ఈ ట్వీట్ చేశారు. షెహబాజ్ తన పర్యటనలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ను కలుసుకుని… ఇస్లామాబాద్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాల్సిందిగా అభ్యర్థించారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారానికి పొరుగు దేశాలైన మాల్దీవులు, బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, మారిషస్, నేపాల్ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఇస్లామాబాద్కు మాత్రం ఆహ్వానం పంపలేదు. ఎన్డీయే గెలుపు అనంతరం పాక్ నుంచి మోదీకి ఎలాంటి అభినందలు రాలేదు. దీనిపై విదేశీ కార్యాలయ ప్రతినిధి ముంతాజ్ జెహ్రా బలోజ్ గతవారంలో స్పందిస్తూ… కొత్త ప్రభుత్వం అధికారికంగా ప్రమాణస్వీకారం చేయనందున భారత ప్రధానిని అభినందించడం తొందరపాటు అవుతుందని వ్యాఖ్యానించారు. భారత్తో సహా ఇరుగుపొరుగు దేశాలతో ఇస్లామాబాద్ సత్సంబంధాలు కోరుకుంటున్నట్టు ఆమె తెలిపారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం కావాలని తాము కోరుకుంటున్నట్టు చెప్పారు. 2014లో నరేంద్ర మోదీ ప్రధానిగా స్వీకారం చేసినప్పుడు అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ హాజరయ్యారు. 2019 ఆగస్టులో జమ్మూకశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణను భారత ప్రభుత్వం రద్దు చేయడంతో ఆ నిర్ణయాన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించేందుకు పాక్ ప్రయత్నాలు చేసింది. అయితే, పాక్ ప్రయత్నానికి అంతర్జాతీయ దేశాల నుంచి పెద్దగా స్పందన రాలేదు. రెండు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని నిలిపివేశాయి.