తెహ్రాన్: లెబనాన్లో ఇటీవల వరుసగా పేజర్లు, వాకీటాకీల పేలుళ్లు సంభవించాయి. హెజ్బుల్లా సభ్యులను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయిల్ ఈ దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిణామాల వేళ ఇరాన్ ఎంపీ ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు. మే నెలలో అప్పటి ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాద ఘటనను పేజర్ల పేలుళ్లతో ముడిపెట్టారు. రైసీ కూడా పేజర్ వినియోగించేవారని వెల్లడిరచారు. ‘నాటి ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణించిన హెలికాప్టర్ కూడా… ఆయన పేజర్ పేలడం వల్లే కూలిపోయి ఉండొచ్చు. రైసీ పేజర్ను వినియోగించేవారు. అయితే, హెజ్బుల్లా దళాలు ఉపయోగించే వాటితో పోలిస్తే ఇది భిన్నమైనదే. ఇక,హెజ్బుల్ల్లా పేజర్ల కొనుగోళ్లలో ఇరాన్ దళాలు కీలక పాత్ర పోషించాయి. అందువల్ల రైసీ ఘటనపై మన నిఘా సంస్థలు ఈ కోణంలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది’ అని ఇరాన్ ఎంపీ అహ్మద్ అర్దెస్తానీ స్థానిక మీడియాకు చెప్పారు. ఈ ఏడాది మే నెలలో అప్పటి ఇరాన్ అధ్యక్షుడిగా ఉన్న రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందిన ఘటన యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇరాన్-అజర్బైజాన్ సరిహద్దుల్లో అధికారిక పర్యటన ముగించుకొని తిరిగివస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ ప్రమాదానికి గురైందని ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే, ఈ ఘటన వెనక ఇజ్రాయిల్ హస్తం ఉండొచ్చనే ఆరోపణలూ వినిపించాయి.