ఇస్లామాబాద్: గతంలో వలే కాకుండా అఫ్గానిస్తాన్లో ఆధునిక పరిపాలన అందిస్తామన్న తాలిబన్ పాలకుల హామీలు గాలి మాటలుగా పరిణమించాయి. ఇంటి గడప దాటేందుకు వీల్లేని విధంగా ఒకదాని తర్వాత ఒకటిగా మహిళలపై ఆంక్షలను తాలిబన్ ప్రభుత్వం విధిస్తోంది. బాలికలు, మహిళల హక్కులు, స్వేచ్ఛను హరిస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో తిరిగేందుకు, చదువుకునేందుకు, ఉద్యోగం చేసేందుకు వీల్లేకుండా చేసింది. పార్కులు, జిమ్లకు వెళ్లకుండా మహిళలను నిషేధించింది. మీడియా స్వేచ్ఛను హరించింది. తాజాగా మహిళల బ్యూటీ సలూన్లపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి కారణాలు తెలుపకుండా నెలరోజుల్లోగా వ్యాపారాలనూ మూసివేయాలని వ్యాపారులకు ఆదేశాలిచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వస్తున్నాగానీ తీరు మార్చుకోని తాలిబన్ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ దేశాన్ని ఏకాకిని చేస్తోంది. ఆర్థిక వ్యవస్థ పతనమై తీవ్రమైన మానవతా సంక్షోభం నెలకొన్న పరిస్థితుల్లోనూ రకరకాల ఆంక్షలతో మహిళలను ఇబ్బంది పెడుతోంది. తాజా ఆంక్షల గురించి అఫ్గాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి మహమ్మద్ సిద్దీఖ్ ఆఖిఫ్ మహాజర్ ప్రకటించారు. దీనికి సంబంధించి వివరాలను వెల్లడిరచలేదుగానీ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ప్రభుత్వ లేఖపై స్పష్టత ఇచ్చారు. జూన్ 24వ తేదీతో వెలువడిన ప్రభుత్వ లేఖ ప్రకారం నెల రోజుల్లోగా వ్యాపారాలు మూసివేయాలని రాజధాని కాబూల్తో పాటు అన్ని ప్రాంతాల్లోని సెలూన్ల యజమానులకు ఆదేశాలు అధినేత హిబాతుల్లా అఖుండ్జాదా పేరిట జారీ అయ్యాయి. గడువు ముగిసిన తర్వాత వ్యాపారాలు మూసివేసినట్లు ధ్రువీకరిస్తూ నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులు పేర్కొన్నాయి. అఫ్గాన్ మహిళల జీవితాలలో మెరుగుదల కోసం తమ ప్రభుత్వం తగు విధంగా చర్యలు తీసుకుంటుందని హిబాతుల్లా ఇటీవల వక్కాణించారుగానీ అందుకు పూర్తి విరుద్ధంగా దేశంలో పరిస్థితులు ఉన్నాయి. 2021 ఆగస్టులో అమెరికా, నాటో దళాల నిష్క్రమణ తర్వాత అఫ్గాన్ తాలిబన్ల వశమైంది.