నామినేట్ చేసిన టర్కీ కమ్యూనిస్టు పార్టీ
ఇస్తాంబుల్: టర్కీలో స్థానిక సమరానికి రంగం సిద్ధమవుతోంది. మార్చి 31న మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో రాణించడం ద్వారా కేంద్రంలో అధికారం బీటలు వారేలా చేయాలని టర్కీ కమ్యూనిస్టు పార్టీ (టీకేపీ) సంకల్పించింది. ఇదే క్రమంలో తమ అభ్యర్థులను ప్రకటించింది. టర్కీ కమ్యూనిస్టు పార్టీ (టీకేపీ) తరపున ఇస్తాంబుల్లో మేయర్ అభ్యర్థిగా జర్నలిస్టు ఓర్హన్ గోక్డెమిర్ నామినేట్ అయ్యారు. ఇస్తాంబుల్లోని నజీం హిక్మత్ సాంస్కృతిక కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగింది. మార్చి 31న స్థానిక ఎన్నికలు జరగనున్న దృష్ట్యా టీకేపీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఈ సమావేశాన్ని నిర్వహించారు. ‘మనది మార్క్సిస్టు పార్టీ. కేంద్ర అధికారంతోనే అన్నింటా మార్పు సాధ్యమని మనకు తెలుసు. స్థానిక ఎన్నికలను ఆ అధికారాన్ని బలహీనపర్చేందుకు సదవకాశంగా పరిగణించాలి’ అని టీకేపీ ప్రధాన కార్యదర్శి కెమెల్ ఓకుయన్ వెల్లడిరచారు. ఇస్తాంబుల్ మున్సిపాలిటీకి కమ్యూనిస్టు పార్టీ తరపు మేయర్ అభ్యర్థిగా 61ఏళ్ల జర్నలిస్టు, రచయిత ఓర్హన్ గోక్డిమీర్ను టీకేపీ ఎంపిక చేసింది. అలాగే ప్రస్తుత తూర్పు తుంసెలీ నగర కమ్యూనిస్టు మేయర్ ఫత్హే మెహనత్ మకోగ్లును ఇస్తాంబుల్లోని కడికోయ్కు నామినేట్ చేసింది. ఈ స్థానం విపక్ష రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ (సీహెచ్పీ)కి కంచుకోట కావడం చర్చనీయాంశమైంది. అంకార మున్సిపాలిటీలోని అరికన్ స్థానం నుంచి అలీ ఉఫుక్, ఇజ్మీర్లో సవస్ సారి, అంతల్యాలో నజ్లి ముత్తును టీకేపీ నామినేట్ చేసింది. భూకంప బాధిత తహే ప్రావిన్స్లోని ప్రధాన మున్సిపాలిటీ కోయ్బసి నుంచి డాక్టర్ ఎండమ్ను నిలబెట్టాలని కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించింది.