పాల్గొన్న వందలాది మంది
ముందస్తు ఎన్నికలకు పీటీఐ డిమాండు
వారెవ్వరినీ ఉండనివ్వొద్దు : హోటళ్లపై పోలీసుల ఆంక్షలు
ప్రసారాలు వద్దు: మీడియాకు ప్రభుత్వాదేశాలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో వందలాది మంది మద్దతుదారులు శుక్రవారం లాహోర్ నుంచి ఇస్లామాబాద్కు ‘హకీకి అజాదీ మార్చ్’గా కదం తొక్కారు. కారులు, ట్రక్కులలో లాంగ్మార్చ్ను చేపట్టారు. ఏప్రిల్లో గద్దెదిగాల్సి వచ్చినప్పటి నుంచి ఇమ్రాన్ఖాన్ వరుసగా ర్యాలీలు నిర్వహిస్తూ తాజా ప్రభుత్వంపై తనకున్న వ్యతిరేకతను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇస్లామాబాద్కు మార్చ్ చేరేసరికి అక్కడ పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతుదారులు లక్షల సంఖ్యలో ఉండాలని, రాజధానిలో ధర్నాకు సిద్ధం కావాలని ఇమ్రాన్ సూచించారు. ఇందుకోసం అధికారుల నుంచి అనుమతులు కోరినట్లు వెల్లడిరచారు. మార్చ్లో అక్కడక్కడ ఆగుతూ ప్రసంగాలు చేశారు. ఈ క్రమంలో మాట్లాడిన ఆయన ‘ఇది రాజకీయ లబ్ధి కోసమే వ్యక్తిగత ప్రయోజనాలు కోసమో లేక ప్రభుత్వాన్ని కూల్చేందుకో చేస్తున్నది కాదని దేశానికి స్వాతంత్య్రం కోసం తాను చేస్తున్న పోరాటమని ఇమ్రాన్ ఖాన్ ఉద్ఘాటించారు. ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉంటే తేదీల విషయంలో షరీఫ్ ప్రభుత్వంతో మంతనాలకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది అక్టోబరులో ఎన్నికలు జరుగుతాయని పాకిస్తాన్ ప్రభుత్వం వెల్లడిరచగా అప్పటివరకు ఆగేదిలేదని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఇదిలావుంటే, ఇస్లామాబాద్కు చేరుకునే సరికి మార్చ్లో భాగమైన వారెవ్వరికీ తమ హోటళ్లలో బసకు అనుమతి లేదని శనివారం ఇస్లామాబాద్ పోలీసులు ఆదేశాలను హోటళ్లు, అతిథిగృహాలకు జారీచేశారు. మార్చ్కు ప్రాధాన్యత ఇవ్వవద్దని పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా నియంత్రణ యంత్రాంగం (పీఈఎంఆర్ఏ)కూ స్పష్టంచేస్తూ నోటిఫికేషన్ జారీ అయింది. లాంగ్ మార్చ్ను ‘హకీకి అజాదీ మార్చ్’ (నిజమైన స్వాతంత్య్ర మార్చ్) పేరిట లాహోర్లోని లిబర్టీ చౌక్ నుంచి మొదలు పెట్టారు. ఇచ్రా, మొజాంగ్, దతా సాహిబ్, ఆజాదీ చౌక్ ప్రాంతాల్లో తమ బలాన్ని ప్రదర్శిస్తూ మార్చ్ ముందుకు సాగింది. నవంబరు 4న ఇస్లామాబాద్కు చేరుకోనుంది. అక్కడ భారీ నిరసన ర్యాలీ/ ధర్నా నిర్వహణకు కసరత్తు జరుగుతోంది.