ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు భారీ ఊరట లభించింది. పాక్ సైనిక జనరల్ ప్రధాన కార్యాలయాలు, ఆర్మీ మ్యూజియంపై దాడితో సహా 12 కేసుల్లో ఆయనకు బెయిల్ లభించింది. గతేడాది మే 9 నాటి అల్లర్ల కేసులో తీవ్రవాద నిరోధక కోర్టు (ఏటీసీ) శనివారం బెయిల్ మంజూరు చేసింది. ఇమ్రాన్ అరెస్ట్కు నిరసనగా సైనిక కార్యాలయాలపై ఆయన మద్దతుదారులు దాడి చేశారు. ఇమ్రాన్తో పాటు మాజీ మంత్రి షా మొహమూద్ ఖురేషీలపై 12కుపైగా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఇమ్రాన్కు రూ.5 లక్షల పూచీకత్తుపై ఏటీసీ జడ్జి మాలిక్ ఇజాన్ అసిఫ్ బెయిల్ మంజూరు చేశారు. బెయిల్ లభించినప్పటికి ఆయన జైల్లో ఉంటారు. ఇప్పటికే తోషఖానా, అధికారిక రహస్యాల లీక్ కేసుల్లో దోషిగా తేలినందున 20ఏళ్ల శిక్ష పడిన విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ మద్దతున్న స్వతంత్రులు సత్తా చాటారు. దాదాపు 100 మంది గెలిచారు. ఫలితాలు వెలువడిన మరుసటి రోజు ఇమ్రాన్కు 12 కేసుల్లో బెయిల్ లభించడం గమనార్హం. షా మొహమూద్ ఖురేషీకి కూడా బెయిల్ లభించింది.