పలస్తీనాకు మద్దతిచ్చే విదేశీ విద్యార్థులను సాగనంపుతా: ట్రంప్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధీష్టించాలని కోరుకుంటున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్ట్ ట్రంప్ మరోసారి వివాదానికి తెరతీశారు. ఒకపైపు పలస్తీనాకు మద్దతుగా ప్రపంచ దేశాలు ఐక్య గళం వినిపిస్తుంటే, పలస్తీనాకు మద్దతుగా ఆందోళనలు చేసిన విదేశీ విద్యార్థులను అమెరికా నుంచి సాగనంపుతానని ట్రంప్ ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక నిరసనలను అణచివేస్తామని ఉద్ఘాటించారు. పలస్తీనాకు మద్దతిస్తూ ఆందోళనలు చేసే విదేశీ విద్యార్థులు, ప్రొఫెసర్లు అందుకోసం త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అధ్యక్షుడిగా ఎన్నుకుంటే 25-30 ఏళ్ల నాటి పరిస్థితులు తెస్తానని హామీ ఇచ్చారు. న్యూయార్క్లో జరిగిన ఒక కార్యక్రమంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. గాజాపై దురాక్రమణలో ఇజ్రాయిల్ పక్షాన నిల్చిన ట్రంప్… కొలంబియా వర్సిటీ ఆందోళనలను అణచివేసిన పోలీస్ శాఖను అభినందించిన విషయం తెలిసిందే. అమెరికాలోని యూనివర్సిటీల్లో ఇటీవల కాలంలో పలస్తీనాకు మద్దతుగా అనేక ఆందోళనలు జరిగాయి. ఇజ్రాయిల్తో పనిచేసే కంపెనీలతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని యూనివర్సిటీ యాజమాన్యాలను డిమాండ్ చేశారు. ఇప్పటివరకు రెండు వేల మందికిపైగా ఆందోళనకారులు అరెస్టుకు గురయ్యారు.