మ్యూనిచ్ : జర్మనీలోని మ్యూనిచ్లో జరుగుతున్న జి7 దేశాల సదస్సుకు వ్యతిరేకంగా గ్రీకు, టర్కీ కమ్యూనిస్టులు భారీ ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. పార్టీ జెండాలు ఊపుతూ, ‘‘ప్రపంచాన్ని రక్తపాతంగా పునర్విభజన చేయవద్దు’’ వంటి నినాదాలు చేశారు. ప్రజల పోరాటాలతోనే మాకు ఆశ ఉంది అంటూ సామ్రాజ్యవాదాన్ని ఖండిరచాలని నినదించారు. దక్షిణ బవేరియా గ్రీస్, టర్కీ కమ్యూనిస్టుల నిరసనలతో మారుమోగిపోయింది. కమ్యూనిస్ట్టు పార్టీ ఆఫ్ గ్రీస్ (కేకేఈ) కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ టర్కీ (టీకేపీ) సభ్యులు, మద్దతుదారులు మ్యూనిచ్లో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఈ నేపధ్యంలో నిరసనకారులు ఒక ఉమ్మడి ప్రకటనను రూపొందించారు. వర్గ పోరాటం ఆవశ్యకతను నొక్కిచెప్పారు, జి7, బ్రిక్స్ ఇతర సామ్రాజ్యవాద సిద్ధాంతాలకు భిన్నంగా వాస్తవ అవసరాల కేంద్రంగా మానవత్వ సమాజం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మ్యూనిచ్లో వేలాది మందితో ప్రదర్శన
జి-7 దేశాల శిఖరాగ్ర సదస్సుకు ఆతిధ్యమిస్తున్న జర్మనీలోని మ్యూనిచ్లో ఒక రోజు ముందే నిరసనలు హౌరెత్తాయి. జి-7 దేశాల విధానాలకు వ్యతిరేకంగా, సామ్రాజ్యవాద యుద్ధాలకు వ్యతిరేకంగా వివిధ దేశాలకు చెందిన వేలాది మంది హక్కుల కార్యకర్తలు ఇక్కడ చేరి నిరసన తెలిపారు. శిలాజ ఇంధనాలకు స్వస్తి పలకాలని, జీవవైవిధ్యాన్ని కాపాడాలని, సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించాలని, ఆకలి, పేదరికంపై పోరాడాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఈ అంశాలపై ప్రపంచ నాయకులు దృష్టి పెట్టాలని వారు కోరారు. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్), ఫ్రైడేటస్ ఫర్ ఫ్యూచర్ వంటి సంస్థలు ఈ నిరసనల్లో భాగస్వాములయ్యాయి. జి-7 దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, ఇంగ్లండ్, అమెరికా నాయకులతో పాటు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షులు చార్లెస్ మిచెల్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షులు ఉర్సులా వాన్డెర్ లెయన్ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఉక్రెయిన్ సంక్షోభంతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి చెందుతున్న దేశాలతో భాగస్వామ్యం, విదేశీ భద్రతా విధానం, స్థిరత్వం, ఆహార భద్రత, బహుపాక్షికత, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వంటి ఆంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఈ సమమావేశంలో పాల్గనేందుకు భారత్, అర్జెంటీనా, ఇండోనేషియా, సెనెగల్, దక్షిణాఫ్రికా ప్రతినిధులు హాజరయ్యారు.