టీడీపీ జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు
విశాలాంధ్ర` పెద్దకడబూరు : టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల చేపట్టిన కర్నూలు జిల్లా పర్యటన భారీగా సక్సెస్ కావడంతో వైసీపీలో వణుకు మొదలైందని టిడిపి జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం మండల పరిధిలోని ఓంనగర్ గ్రామంలో నియోజకవర్గంలోని ఆయా గ్రామాల క్లస్టర్, బూతుల ఇంచార్జీలకు ఒక రోజు శిక్షణా కార్యక్రమం టీడీపీ మండల అధ్యక్షుడు బసలదొడ్డి ఈరన్న అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ తిక్కారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 16,17,18 తేదీలలో పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు, కర్నూల్లలో జరిగిన చంద్రబాబు రోడ్ షో, బాదుడే బాదుడు కార్యక్రమాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. దీంతో వైసీపీ నేతల్లో అలజడి మొదలైందన్నారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతోందని ఎద్దేవా చేశారు. పోలీసుల అండతో వైసీపీ పాలన కొనసాగుతోందని, ఇది ఎక్కువ రోజులు కొనసాగదని హెచ్చరించారు. టిడిపి అధికారంలోకి వస్తే వడ్డీతో సహా చెల్లిస్తామని వైసీపీ నేతల ఆగడాలపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయిందని, వైసీపీ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. వచ్చే జనవరి నెలలో నారా లోకేష్ పాదయాత్ర మొదలవుతుందని, నియోజకవర్గంలో నాలుగు రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. 2024 లో జరిగే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మంత్రాలయంలో ఎమ్మెల్యేగా తిక్కారెడ్డిని గెలుపుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, నాయకులు ఉలిగయ్య, పన్నాగ వెంకటేశ్, జ్ఞానేష్, ఏసేపు, మల్లికార్జున, ఆంజనేయ, వీరేష్ గౌడ్, దశరథరాముడు, గోపాల్ రెడ్డి, దాసప్ప రెడ్డి, నాగప్ప, సర్దార్ భాష, ముక్కన్న, సత్యగౌడ్, అంజి, మునెప్ప, నాలుగు మండలాల్లోని క్లస్టర్, బూతుల ఇంచార్జీలు పాల్గొన్నారు..