విశాలాంధ్ర, పెద్దకడబూరు : రైతుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తున్న ఆర్ ఐ పై చర్యలు తీసుకోవాలంటూ బుధవారం పెద్దకడబూరులోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులతో కలసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం తాలూకా కార్యదర్శి ఆంజనేయ మాట్లాడుతూ రైతులు భూ సమస్యలతో కార్యాలయానికి వచ్చి పరిష్కారం కోసం ధరఖాస్తులు పెట్టినా వాటిని పరిష్కరించడంలో తాహశీల్దార్, ఆర్ ఐ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. పెద్దకడబూరు గ్రామానికి చెందిన ఐదు మంది రైతులు సర్వేనెంబర్ 409 లో గల దాదాపు 7 ఎకరాల్లో గత 50 సంవత్సరాల నుంచి సాగులో ఉన్నారని తెలిపారు. అయితే ఇప్పుడు కటిక మహ్మద్ తనకు కూడా 409 సర్వేనెంబర్ లో భూమి ఉందంటూ రైతులపై దౌర్జన్యం చేస్తున్నాడన్నారు. అతను గత 40 సంవత్సరాలుగా 410 సర్వేనెంబర్ లో భూమి సాగు చేస్తున్నారని తెలిపారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాము సాగు చేస్తున్న భూమిలోకి వచ్చి గొడవలు చేస్తున్న కటిక మహ్మద్ పై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు వెంకట స్వామి, రమేష్, లక్ష్మమ్మ, లక్ష్మన్న, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.