విశాలాంధ్ర, పెద్దకడబూరు : మండల పరిధిలోని బసలదొడ్డి గ్రామ శివారుల్లోని విద్యుత్ సబ్ స్టేషన్ ఆవరణలో ఏఈ నాగవేంద్రం ఆధ్వర్యంలో బుధవారం రైతులకు విద్యుత్ వాడకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఈ రాఘవేంద్ర మాట్లాడుతూ విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించి నాణ్యమైన విద్యుత్ వాడుకోవాలని సూచించారు. అలాగే అనవసరంగా లైట్లు, ఫ్యాన్స్ వేయొద్దని తెలిపారు. బసలదొడ్డి, నాగలాపురం గ్రామాల రైతులు తమ సమస్యలను ఏడీఈ దృష్టికి తెచ్చారు. తాగునీటి బోర్లకు ఉన్న లైన్లకు 24 గంటలు విద్యుత్ సరఫరా చేయాలని కోరారు. అలాగే శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్థంభాలను తొలగించాలని తెలిపారు. పైరయ్యస్వామి గుడి వరకు రహదారి వెంబడి విద్యుత్ లైన్ వేయాలని, లో ఓల్టేజ్ సమస్యను అధిగమించేందుకు అదనపు ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేయాలని ఏడీఈని కోరారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బుడ్డ అంజినమ్మ, శివరాం, ఎంపీటీసీ అంజినయ్య, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.